పదో రోజు బ్రతికించినా సరిపోలేదు బ్రో

విడుదలయ్యాక నాలుగో రోజే విపరీతమైన డ్రాప్ తో ఫలితాన్ని తేల్చేసిన బ్రో నిన్న అనూహ్యంగా మంచి నెంబర్లు నమోదు చేయడం బయ్యర్లకు ఊరట కలిగించింది. సుమారు 2 కోట్ల 10 లక్షల గ్రాస్ తో కాస్త తెరిపినిచ్చింది. అంతకు ముందు సోమవారం నుంచి శుక్రవారం దాకా కోటిన్నర అందుకోవడమే మహా కష్టంగా ఫీలైన బ్రో ఇంకా బ్రేక్ ఈవెన్ కు దూరంలో ఉన్నప్పటికీ నష్టాల శాతం తగ్గడానికి వస్తున్న కలెక్టన్లు ఉపయోగపడతాయి. లాభాల్లోకి ప్రవేశించాలంటే ఇంకో 33 కోట్ల షేర్ రావాల్సిన నేపథ్యంలో అది దాదాపు అసాధ్యమేనని చెప్పాలి. దానికి కారణాలున్నాయి.

రాబోయే పదో తేదీ జైలర్ ని ఏషియన్, సురేష్ సంస్థలు సంయుక్తంగా పంపిణి చేస్తుండటంతో పెద్ద సంఖ్యలో థియేటర్లు దక్కనున్నాయి. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో చిరంజీవి భోళా శంకర్ రంగంలోకి దిగుతుంది. బ్రో ప్రస్తుతం హోల్డ్ చేసిన ముప్పాతిక స్క్రీన్లను సూపర్ స్టార్, మెగాస్టార్ పంచేసుకుంటారు. బేబీని  అయిదో వారం కూడా కొనసాగించేందుకు ఎగ్జిబిటర్లు మొగ్గు చూపుతున్న పరిస్థితిలో మెయిన్ సెంటర్స్ లో అది కంటిన్యూ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఏ కోణంలో చూసినా బ్రోకు నామమాత్రంగా స్క్రీన్లు షోలు ఉండబోతున్నాయన్నది వాస్తవం.

వీటికి తోడు సన్నీ డియోల్ గదర్ 2, అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ 2 బరిలో ఉన్నాయి. సిటీ మల్టీప్లెక్సుల్లో వీటికి చెప్పుకోదగ్గ షోలు ఇస్తారు. షెడ్యూల్స్ చాలా టైట్ గా మారిపోతాయి. ఇలాంటి సిచువేషన్ లో ఆల్రెడీ తలరాత డిసైడైపోయిన బ్రోను రన్ చేయడం కష్టమే. సక్సెస్ టూర్ కోసం తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించాలని ముందు నిర్ణయించుకున్న సాయి ధరమ్ తేజ్ కొన్ని ఊళ్లు తిరిగి వాస్తవం అర్థమై ఆ ఆలోచన విరమించుకున్నాడు. జనాల దృష్టి కొత్త సినిమాల మీదకు వెళ్లిపోయింది. ఈ లెక్కన ఎంతలేదన్నా పాతిక నుంచి ముప్పై కోట్ల నష్టంతో బ్రో ఫైనల్ రన్ ముగించవచ్చు.