వాయిదా పుకార్ల మీద టైగర్ సీరియస్

దసరా పండక్కు ఇంకా రెండున్నర నెలలు ఉన్నప్పటికీ అప్పుడు విడుదల కాబోయే సినిమాలకు సంబంధించి చాలా హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అక్టోబర్ 19 విజయ్ లియో, బాలకృష్ణ భగవంత్ కేసరి పరస్పరం తలపడాలని ఆల్రెడీ నిర్ణయించుకుని అఫీషియల్ గా ప్రకటనలు కూడా ఇచ్చాయి. ప్రమోషన్లు కూడా మెల్లగా పెంచుతున్నారు. కానీ ఒక రోజు ఆలస్యంగా 20న వచ్చే రవితేజ టైగర్ నాగేశ్వరరావు ఇంకా యాక్టివ్ మోడ్ లోకి రాలేదు. దీంతో ఇదే అదనుగా భావించి మాస్ మహారాజా వెనుకడుగు వేస్తున్నాడని, పోటీ వల్ల వాయిదా పడొచ్చనే ప్రచారం ఊపందుకుంది.

వీటి పట్ల టైగర్ నాగేశ్వరరావు టీమ్ సీరియస్ గా స్పందించింది. కొన్ని వర్గాలు పనిగట్టుకుని పోస్ట్ పోన్ గురించి స్ప్రెడ్ చేస్తున్నాయని వాటిని నమ్మొద్దంటూ, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 20న బెస్ట్ థియేటర్ ఎక్స్ పీరియన్స్ తో మీముందుకు వస్తామని ప్రత్యేకంగా ఒక నోట్ ద్వారా కన్ఫర్మేషన్ ఇచ్చింది. దశాబ్దాల క్రితం ప్రభుత్వాలను వణికించిన స్టువర్ట్ పురం గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా రూపొందుతున్న ఈ పీరియాడిక్ థ్రిల్లర్ కు ఆ మధ్య ఒక ప్రీ టీజర్ వదిలితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎక్కువగా ఉండటంతో టీజర్ లేట్ అవుతోంది.

ముక్కోణపు యుద్ధంలో రవితేజకు బాలకృష్ణ, విజయ్ ల నుంచి పెద్ద సవాలే ఎదురు కానుంది. వంశీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న టైగర్ నాగేశ్వరరావు మాస్ రాజాకు సరైన ప్లానింగ్ తో రిలీజవుతున్న మొదటి ప్యాన్ ఇండియా మూవీ. గతంలో ఖిలాడీ లాంటివి ట్రై చేశారు కానీ వాటిని సరిగా మార్కెట్ చేయకపోవడంతో పాటు తెలుగులోనే ఫెయిల్యూరయ్యే కంటెంట్ కావడంతో లైట్ తీసుకున్నారు. కానీ గెటప్ మొదలుకుని కథా కథనాల దాకా నాగేశ్వరరావు రేంజ్ వేరేగా ఉంటుంది. లియో తరహాలో మొత్తం అయిదు భాషల్లో రిలీజ్ ని ప్లాన్ చేయబోతున్నారు.