ఆమిర్ ఖాన్ మళ్లీ తేనె తుట్టెను కదిపాడు

వివాద రహితుడిగా, అందరివాడుగా కనిపించే ఆమిర్ ఖాన్.. కొన్నేళ్ల కిందట చేసిన ఓ కామెంట్‌తో ఏ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కొన్నాడో తెలిసిందే. ఇండియాలో ‘అసహనం’ పెరిగిపోతోందని.. తన భార్య దేశం విడిచి వెళ్లిపోదామా అందని ఓ ఇంటర్వ్యూలో అతను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. మోడీ సర్కారు అధికారంలో ఉండగా ముస్లింలకు దేశంలో రక్షణ లేదంటూ ఓ వర్గం చేస్తున్న వాదనను బలపరిచేలా ఆమిర్ అప్పుడు వ్యాఖ్యలు చేశాడు. ఐతే ఆమిర్ దేశాన్ని కించపరిచేలా మాట్లాడాడంటూ తటస్థంగా ఉండే వాళ్లు సైతం అప్పుడు అతడిపై విరుచుకుపడ్డారు. ఇండియాలో ఆమిర్ లాంటి సెలబ్రెటీకి వచ్చిన కష్టం ఏంటో చెప్పాలంటూ మండిపడ్డారు. ఈ దెబ్బకు ఆమిర్ ఇమేజ్ బాగా డ్యామేజ్ అయింది. అతను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న బ్రాండ్‌లు కూడా దెబ్బ తినే పరిస్థితి వచ్చింది.

అప్పట్నుంచి సంయమనం పాటిస్తూ వస్తున్నాడు ఆమిర్. కానీ ఇప్పుడో మరోసారి తనలోని మరో కోణాన్ని ఆమిర్ బయటపెట్టాడు. మళ్లీ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు. తన కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్ కోసం ఆమిర్ చిత్ర బృందంతో కలిసి టర్కీకి వెళ్లాడు. అక్కడ టర్కీ ప్రధాని బినాలి యిల్దిరిమ్ భార్య, టర్కీ ప్రథమ మహిళ ఎమిన్ ఎర్దోగన్‌ను కలిశాడు. టర్కీ ప్రధాని పలుమార్లు ఇండియాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. విషం కక్కాడు. కశ్మీర్ అంశంలో పాకిస్థాన్‌కు మద్దతు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి భార్యను ఆమిర్ కలిసి సమావేశం అయి ఆ ఫొటోలను మీడియాకు రిలీజ్ చేయడంతో ఆమిర్‌ను దేశద్రోహిగా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో విషయం ఏంటంటే కశ్మీర్ సహా వివిధ అంశాల్లో భారత్‌కు పూర్తి మద్దతు ప్రకటించే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహ భారత్‌కు వచ్చినపుడు.. ముంబయిలో ఖాన్ త్రయాన్ని కలవాలనుకున్నాడు. కానీ ఆమిర్‌తో పాటు సల్మాన్, షారుఖ్ ఆయన్ని కలవడానికి ఇష్టపడలేదు. ఆ విషయాన్ని కూడా ఇప్పుడు బయటికి తీసి ఆమిర్‌ మీద విరుచుకుపడుతున్నారు నెటిజన్లు.