నెగెటివ్ టాక్‌… అయినా వసూళ్లు పెరిగాయి

బాలీవుడ్లో కొంచెం గ్యాప్ తర్వాత వచ్చిన పెద్ద సినిమా ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’. రణ్వీర్ సింగ్, ఆలియా భట్ జంటగా.. స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రూపొందించిన చిత్రమిది. గత రెండు దశాబ్దాల్లో ప్రొడక్షన్‌కే ఎక్కువ పరిమితం అవుతూ.. ఎప్పుడో ఒకసారి మాత్రమే డైరెక్షన్ చేస్తున్న కరణ్.. 2016లో వచ్చిన ‘యే దిల్ హై ముష్కిల్’ తర్వాత స్వీయ దర్శకత్వంలో తీసిన సినిమా ఇదే.

విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. కరణ్ 90వ దశకంలో తీసిన సినిమాల స్టయిల్లోనే ఇప్పుడీ చిత్రాన్ని రూపొందించాడనే విమర్శలు వచ్చాయి. రివ్యూలు చాలా వరకు నెగెటివ్‌గానే వచ్చాయి. సోషల్ మీడియా ఫీడ్ బ్యాక్ కూడా ఏమంత బాగా లేదు. కానీ ఈ సినిమాపై వీకెండ్ వరకు అయితే నెగెటివ్ టాక్ పెద్దగా ప్రబావం చూపలేదు.

తొలి రోజు ఇండియలో రూ.11 కోట్ల మేర నెట్ వసూళ్లు రాబట్టింది ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని’. మామూలుగా నెగెటివ్ టాక్ ఉన్న సినిమాకు రెండో రోజు వసూళ్లు  కొంచెం తగ్గుతుంటాయి. కానీ ఈ సినిమాకు మాత్రం 40 శాతానికి పైగా వసూళ్లు పెరిగాయి. రెండో రోజు రూ.16 కోట్లకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఆదివారం ఈ చిత్రం ఇంకా బెటర్ అయింది. రూ.19 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది దేశవ్యాప్తంగా. మొత్తంగా ఈ సినిమా వీకెండ్లో రూ.46 కోట్లు రాబట్టింది. విదేశీ వసూళ్లు ఇంకో రూ.20 కోట్ల దాకా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

వీకెండ్ వరకు అయితే అంచనాలను మించి పెర్ఫామ్ చేసింది కరణ్ జోహార్ మూవీ. కానీ నెగెటివ్ టాక్‌ను తట్టుకుని వీక్ డేస్‌లో నిలబడటం మాత్రం కష్టమే. ఈ సినిమా బడ్జెట్ రూ.200 కోట్లకు పైమాటే అంటున్నారు. ఐతే నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా భారీ ఆదాయం అందుకున్న కరణ్ టేబుల్ ప్రాఫిట్‌తో సినిమాను రిలీజ్ చేశాడు. వీక్ డేస్‌లో సినిమా ఎంతమేర నిలబడుతుందన్నదాన్ని బట్టి బయ్యర్లు బయటపడతారా లేదా అన్నది తేలుతుంది.