హైదరాబాదీల ఫేవరెట్ మల్టీప్లెక్స్‌కి 20 ఏళ్లు

ఇప్పుడంటే చిన్న చిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్సులు వచ్చేశాయి. అత్యుత్తమ సీటింగ్, సౌండ్, విజువల్ ఎక్స్‌పీరియన్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయి. కానీ 20 ఏళ్ల ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాక.. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా సింగిల్ స్క్రీన్లదే రాజ్యం. మల్టీప్లెక్స్ అంటే ఏంటో కూడా తెలియదు అప్పటిదాకా జనాలకి. మహా అయితే ఒకే కాంపౌండ్లో వేర్వేరు థియేటర్లుండేవి. వాటన్నింట్లో కూడా సినిమా చూసే అనుభూతి మాత్రం సేమ్.

అలాంటి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ పక్కన మొదలైందే ప్రసాద్ మల్టీప్లెక్స్. ఒకేచోట ఐదారు స్క్రీన్లతో.. వాటిలో బెస్ట్ క్వాలిటీతో సినిమాలను ప్రదర్శించడం మొదలయ్యాక ప్రేక్షకుల్లో ఎక్కడెక్కడి నుంచే అక్కడికి రావడం మొదలైంది. సింగిల్ స్క్రీన్లతో పోలిస్తే కొంచెం ఎక్కువ రేటుతో బెస్ట్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ప్రసాద్స్.. హైదరాబాదీ సినిమా ప్రియుల రెండో ఇల్లుగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

ఈ 20 ఏళ్లలో మల్టీప్లెక్స్ ఇండస్ట్రీ దిన దిన ప్రవర్ధమానం చెంది.. నగరం మొత్తంలో వందల్లో మల్టీప్లెక్స్ స్క్రీన్స్ వచ్చేశాయి. సింగిల్ స్క్రీన్ల సంఖ్యను అవి దాటేశాయి. పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్, బిగ్ సినిమాస్.. ఇలా బోలెడన్ని మల్టీప్లెక్సులు చూస్తున్నాం. కానీ ఇప్పటికీ హైదరాబాదీలకు ‘ప్రసాద్ మల్టీప్లెక్స్’ చాలా ప్రత్యేకం. ప్రతి కొత్త సినిమాకు ఫస్ట్ షో పడేది ఇక్కడే. 8.45కి ప్రసాద్స్‌లో ఫస్ట్ షో చూడటం సెలబ్రెటీలకు, మీడియా ప్రతినిధులతో పాటు సినీ ప్రియులకు ఇష్టమైన వ్యాపకం.

శుక్రవారం ఉయదం సెలబ్రెటీలు, మీడియా ప్రతినిధుల హడావుడికి తోడు.. షో అయ్యాక టీవీ, యూట్యూబ్ ఛానెళ్ల మైకుల ముందు రివ్యూలు చెప్పే సినిమా ప్రియుల హంగామాతో అక్కడ సందడే వేరుగ ఉంటుంది. మిగతా మల్టీప్లెక్సులకు దీటుగా క్వాలిటీ, వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తూనే.. రీజనబుల్ టికెట్, తినుబండారాల ధరలతో తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటుంది ప్రసాద్స్. ఇక్కడి లార్జ్ స్క్రీన్ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అనడంలో సందేహం లేదు. అవతార్ లాంటి సినిమాలు చూడాలంటే దీన్ని మించిన స్క్రీన్ లేదు.

వేరే రకమైన ఎంటర్టైన్మెంట్స్, షాపింగ్ ఆకర్షణలతోనూ ప్రసాద్స్ ఎప్పుడూ జనాలతో కళకళలాడుతుంటుంది. ఇదొక ల్యాండ్ మార్క్ టూరిస్ట్ స్పాట్ కూడా. హైదరాబాద్ చూసేందుకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ప్రసాద్స్‌పై ఒక లుక్కేయాలని, ఇక్కడ సినిమా చూడాలని కోరుకుంటారు. 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసాద్స్ సంబరాలకు సిద్ధమవుతూ ఒక వీడియోను కూడా రిలీజ్ చేసింది. ఇది సెలబ్రెటీలతో పాటు సినీ ప్రియులందరిలోనూ ఒక ఎమోషన్ తీసుకొస్తోంది.