‘బ్రో’ను వదిలేసి మంచి పని చేశారు

రెండేళ్ల ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’ రిలీజైనపుడు ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటిదాకా పెద్ద సినిమాలకు తెల్లవారుజామునే ఏపీలో బెనిఫిట్ షోలు పడిపోయేవి. అలాగే అనధికారికంగా ఫ్యాన్స్ షోలకు రేట్లు పెంచి అమ్ముకునేవారు. కానీ ఆ సినిమాకు బెనిఫిట్ షోలు ఆగిపోయాయి. కనీసం ఉదయం కూడా తొందరగా షోలు పడలేదు. 10-11 మధ్య రెగ్యులర్ మార్నింగ్ షోల టైంలోనే సినిమా ప్రదర్శన మొదలైంది. దీనికి తోడు అప్పటికే ఉన్న రెగ్యులర్ రేట్లను కూడా తగ్గించి పడేశారు. 

ఎప్పుడో దశాబ్దం కిందటి జీవోను పట్టుకొచ్చి టికెట్ ధరలను బాగా తగ్గించారు. చిన్న సెంటర్లలో 5 రూపాయలకు కింది తరగతి టికెట్లను అమ్మడం గమనార్హం. కేవలం పవన్ సినిమాను ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో తర్వాత అన్ని సినిమాలకూ ఈ రేట్లను వర్తింపజేశారు. దాదాపు ఏడాది పాటు ఇదే పరిస్థితి కొనసాగింది. తర్వాత సినీ పెద్దలు పలుమార్లు ప్రయత్నించాక రేట్లు పెంపునకు అంగీకరించి కూడా ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ టైంకి ఉద్దేశపూర్వకంగా జీవోను ఆపి ఉంచడం.. ఆ సినిమా రిలీజైన కొన్ని రోజులకే జీవోను బయటికి తీయడం తెలిసిన విషయమే.

పవన్ మీద జగన్ అండ్ కోకు ఎంత ద్వేషం ఉందో ఆ రెండు సినిమాల రిలీజ్ టైంలో స్పష్టంగా కనిపించింది. ఈ నేపథ్యంలో పవన్ కొత్త చిత్రం ‘బ్రో’కు కూడా ఏదో రకంగా ఇబ్బందులు సృష్టించడం ఖాయం అనుకున్నారు. ఐతే ‘బ్రో’ పెద్ద సినిమానే అయినప్పటికీ నిర్మాతలే తమకు తాముగా రేట్ల పెంపు కోరలేదు. ఇక అదనపు షోల విషయానికి వస్తే.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు అడిగి అనుమతులు తెచ్చుకున్నారా.. లేక ఎగ్జిబిటర్లు ఇది మామూలు విషయమే అనుకుని చేస్తున్నారా తెలియదు కానీ.. వివిధ నగరాల్లో షోలు అయితే ఉదయం 7.30-9 గంటల మధ్య మొదలైపోతున్నాయి. అన్ని చోట్లా ఐదో షో పడుతోంది. 

ఈ విషయంలో జగన్ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా ‘బ్రో’ను వదిలేసినట్లు కనిపిస్తోంది.  ఇంతకుముందంటే ఏం చేసినా చెల్లింది కానీ.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండగా  ప్రభుత్వ వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతున్న సమయంలో పవన్ సినిమాను గిల్లితే అదొక చర్చనీయాంశం అవుతుంది. జగన్ అండ్ కో సంకుచితత్వం గురించి అందరూ మాట్లాడుకుంటారు. ఈ విషయం అర్థం చేసుకునే ‘బ్రో’ విషయంలో జోక్యం చేసుకోనట్లు కనిపిస్తోంది. ఎన్నికల ముంగిట జగన్ సర్కారు కొంచెం ఆలోచనతోనే వ్యవహరిస్తోందనడానికి ఇది ఉదాహరణ.