బాలయ్య జానపద అద్భుతం మరోసారి

బాలకృష్ణ చేసిన సినిమాల్లో భైరవ ద్వీపంది ప్రత్యేక స్థానం. 1994లో విడుదలైన ఈ జానపద అద్భుతం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. విజయా సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించడం అప్పట్లో టాక్ అఫ్ ది ఇండస్ట్రీ. కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న టైంలో ఇలాంటివి ఎవరు చూస్తారనే భ్రమను తొలగిస్తూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరపై మాయాజాలం చేశారు. రోజా హీరోయిన్ గా రూపొందిన భైరవ ద్వీపంని గ్రాఫిక్స్ పెద్దగా లేని రోజుల్లోనే ఔరా అనిపించేలా తెరకెక్కించారు. ఇన్నేళ్లు దాటినా అందులోని మేజిక్ 5జి తరాన్ని కూడా కట్టిపడేసేలా ఉంటుంది.

అలాంటి విజువల్ వండర్ ని వచ్చే నెల ఆగస్ట్ 5న గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతున్నారు.ఆ మధ్య బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేసుకున్నారు కానీ నరసింహనాయుడు ఉండటంతో దీన్ని డ్రాప్ చేశారు. భైరవ ద్వీపానికి సంగీత దర్శకుడిగా మాధవపెద్ది సురేష్ ఎవర్ గ్రీన్ ఆల్బమ్ ఇచ్చారు. ఆ సంవత్సరానికి ఈ మూవీ 9 నంది అవార్డులు దక్కించుకోవడం ఒక సంచలనం. కేవలం వారం గ్యాప్ లో నాగార్జున హలో బ్రదర్ రిలీజై ఘనవిజయం సాధించినప్పటికీ రెండూ శతదినోత్సవాలు జరుపుకోవడం విశేషం. అదే నెలలో వచ్చిన ఎస్వి కృష్ణారెడ్డి యమలీల సైతం రికార్డులు కొట్టింది.

సో ఇప్పటి జనరేషన్ కు 4K సాంకేతికత భైరవ ద్వీపంకు గొప్ప అనుభూతిని జత చేస్తుంది. ఒకరిద్దరు మినహాయించి ఆ సినిమాలో నటించిన పని చేసిన నటీనటులు, టెక్నికల్ టీమ్ అందరూ అందుబాటులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఏదైనా ఈవెంట్ లాంటిది ప్లాన్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. వయసు దృష్ట్యా సింగీతం వారు విశ్రాంతిలో ఉన్నప్పటికీ  ఈ విషయం తెలియాలే కానీ ఉత్సాహంగా కదిలి వస్తారు. ఆ రోజు ఆగస్ట్ 5న చెప్పుకోదగ్గ కొత్త సినిమాలేం లేవు కానీ సూర్య సన్ అఫ్ కృష్ణన్ ఒకటే రీ రిలీజ్ పోటీలో ఉంటుంది.