మీనాక్షి.. దశ తిరిగినట్లుందే

అందాల సుంద‌రి కిరీటాలు ద‌క్కించుకున్న వాళ్ల చూపంతా ప్ర‌ధానంగా బాలీవుడ్ మీదే ఉంటుంది. కానీ మాజీ మిస్ ఇండియా, హ‌రియాణా అమ్మాయి మీనాక్షి చౌద‌రి చూపు మాత్రం టాలీవుడ్ మీద ప‌డింది. అక్కినేని ఫ్యామిలీ కుర్రాడు సుశాంత్‌తో క‌లిసి చేసిన ఇచట వాహ‌న‌ములు నిలుప‌రాదు తెలుగులో త‌న తొలి చిత్రం. ఆ సినిమా నిరాశ ప‌రిచిన‌ప్ప‌టికీ.. ఈ అందాల సుంద‌రికి టాలీవుడ్లో అవ‌కాశాలు ఆగిపోలేదు.

ఖిలాడి, హిట్-2 లాంటి చిత్రాల‌తో ఆమె మంచి గుర్తింపే సంపాదించింది. దీంతో ఆమె కెరీర్ ఊపందుకుంది. ఇటీవ‌లే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌ర‌స‌న గుంటూరు కారం సినిమాలో అవ‌కాశం ద‌క్క‌డం మీనాక్షి కెరీర్‌లో గొప్ప మ‌లుపు.  త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేను త‌ప్పించి మ‌రీ ఆమెకు ఛాన్స్ ఇచ్చారు.

మ‌హేష్ స‌ర‌స‌న సెకండ్ హీరోయిన్‌గా చేసినా స‌రే.. మీనాక్షి కెరీర్‌కు మంచి ఊపు వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ ఛాన్స్ ద‌క్కిన కొన్ని రోజుల్లోనే మ‌రో క్రేజీ మూవీలో అవ‌కాశం అందుకుంది మీనాక్షి. వ‌రుణ్ తేజ్ హీరోగా క‌రుణ్ కుమార్ రూపొందించ‌నున్న కొత్త చిత్రంలో మీనాక్షినే క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. ఇది కాక విశ్వ‌క్సేన్ కొత్త సినిమాలోనూ మీనాక్షి క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

అంటే వ‌చ్చే ఏడాది గుంటూరు కారం స‌హా మూడు చిత్రాల‌తో మీనాక్షి ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతోంద‌న్న‌మాట‌. ఆమె ఆల్రెడీ త‌మిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవ‌లే రిలీజైన హ‌త్య సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించింది. ఈ సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ మీనాక్షి పెర్ఫామెన్స్ ఆక‌ట్టుకుంది. క‌థ మొత్తం త‌న చుట్టూనే తిరిగే సినిమాలో త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. చూస్తుంటే మీనాక్షి రాబోయే రోజుల్లో పెద్ద రేంజికి వెళ్లేలా క‌నిపిస్తోంది.