ప్రాజెక్ట్-Kపై ఆయ‌న క్లారిటీ ఇచ్చాడు

క‌ల్కి 2898 ఏడీగా పేరు మార్చుకున్న ప్రాజెక్ట్ కే సినిమా నుంచి ఇటీవ‌లే రిలీజైన టీజ‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌భాస్ ఫ‌స్ట్ లుక్ చూసి ట్రోల్ చేసిన వాళ్లంతా.. టీజ‌ర్ చూసి ముక్కున వేలేసుకున్నారు. సినిమాకు ముందున్న హైప్ తిరిగి వ‌చ్చేసిన‌ట్లు అయింది. ఐతే టీజ‌ర్ చూసిన వాళ్లంద‌రినీ ఒక సందేహం వెంటాడింది. ఇంత‌కీ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడ‌న్న‌దే ఆ డౌట్.

ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి సైతం ఇదే సందేహం వ్య‌క్తం చేశాడు. కానీ దీనిపై చిత్ర బృందం మౌన‌మే వ‌హిస్తోంది. ఐతే క‌ల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్‌పై ఆ చిత్ర బృందంతో సన్నిహిత సంబంధాలున్న సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌రద్వాజ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా వ‌చ్చే ఏడాది ఏప్రిల్- మే నెల‌ల్లో రిలీజ‌య్యే అవ‌కాశ‌మున్న‌ట్లు ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న వెల్ల‌డించాడు.

ప్రాజెక్ట్-కేను వ‌చ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని ముందు అనుకున్నారు. ఆ మేర‌కు చాలా ముందే డేట్ కూడా ఇచ్చారు. కానీ ఈ భారీ చిత్రాన్ని ఆ స‌మ‌యానికి రెడీ చేయ‌డం అసాధ్యం అని తేలిపోయింది. అధికారికంగా వాయిదా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌లేదు కానీ.. సంక్రాంతికి సినిమా రాద‌న్న‌ది స్ప‌ష్టం. త‌మ్మారెడ్డి మాట‌లు చూస్తే న‌మ్మ‌ద‌గ్గ‌ట్లే ఉన్నాయి. ఆయ‌న సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్త‌వుతుందో.. ప్ర‌స్తుత స్టేట‌స్ ఏంటో కూడా చెప్పారు. సినిమాను రెండు భాగాలుగా తీయ‌బోతున్న‌ట్లు ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసిన సంగ‌తి తెలిసిందే.

ఫ‌స్ట్ పార్ట్‌కు సంబంధించి ఇంకో 40 రోజుల షూట్ బ్యాలెన్స్ ఉంద‌ని.. సెప్టెంబ‌రులో కొత్త షెడ్యూల్ మొద‌లుపెట్టి మిగ‌తా టాకీ పార్ట్ పూర్తి చేస్తార‌ని.. ఆ త‌ర్వాత పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ అంతా అవ‌గొట్టి వ‌చ్చే వేస‌విలో ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్ చేస్తార‌ని త‌మ్మారెడ్డి వెల్ల‌డించారు. ఇందులో విల‌న్ పాత్ర చేస్తున్న క‌మ‌ల్ హాస‌న్ ఇంకా షూట్‌కు రానే లేద‌ని.. కొత్త షెడ్యూల్లో ఆయ‌న జాయిన్ అవుతార‌ని.. ఆయ‌న పాత్ర పూర్తి స్థాయిలో సెకండ్ పార్ట్‌లోనే ఉంటుంద‌ని ఆయన తెలిపారు.