చాన్నాళ్లకు కొత్త దర్శకుడికి రవితేజ ఛాన్స్

టాలీవుడ్లో చాలామంది యువ దర్శకులకు అవకాశాలు ఇచ్చి వాళ్లు పెద్ద రేంజికి వెళ్లేలా చేసిన హీరో మాస్ రాజా రవితేజ. శ్రీను వైట్ల, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని, బాబీ.. ఇలా రవితేజ పరిచయం చేసి పెద్ద దర్శకులైన వాళ్ల జాబితా పెద్దదే. ఐతే ఈ మధ్య మాస్ రాజా ఇలా కొత్త దర్శకులను ప్రోత్సహించట్లేదు. 2017లో వచ్చిన రవితేజ సినిమా ‘టచ్ చేసి చూడు’తో చివరగా ఒక కొత్త దర్శకుడు పరిచయం అయ్యాడు.

అతనే.. విక్రమ్ సిరికొండ. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. దీంతో మళ్లీ మాస్ రాజా ఈ సాహసం చేయలేదు. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తీసిన శరత్ మండవకు తెలుగులో తొలి సినిమా ఇదే కానీ.. అతను ఆల్రెడీ తమిళంలో ఒక సినిమా తీశాడు. ఐతే ఇప్పుడు మాస్ రాజా మళ్లీ ఓ కొత్త దర్శకుడితో జట్టు కట్టబోతున్నాడు. ఆ దర్శకుడి పేరు వాసు. తనతో అతి త్వరలో మాస్ రాజా సినిమా మొదలు కాబోతోంది.

టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ రవితేజతో తొలిసారి జట్టు కట్టబోతోంది. వాసు చెప్పిన ఓ మాస్ కథ అటు నిర్మాణ సంస్థకు, ఇటు రవితేజకు నచ్చడంతో ఈ సినిమా పట్టాలెక్కనుంది. త్వరలోనే ముహూర్త వేడుక చేయబోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న స్టార్ హీరోల్లో రవితేజ ఒకడు. ఆయన లైనప్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, క్రేజీగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈగల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాల కోసం సమాంతరంగా పని చేస్తున్నాడు మాస్ రాజా. డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాల తర్వాత గోపీచంద్ మలినేనితో రవితేజ చేయబోయే సినిమాను ఇటీవలే అనౌన్స్ చేశారు. అది మైత్రీ మూవీ మేకర్స్‌లో తెరకెక్కబోతోంది. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వంలో హిందీ హిట్ ‘రైడర్’ను రవితేజ హీరోగా రీమేక్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలాగే ‘ధమాకా’ తర్వాత త్రినాథరావు నక్కినతోనూ మాస్ రాజా ఓ సినిమా చేయనున్నాడు.