‘బేబి’ రియల్ స్టోరీలో ఏం జరిగిందో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్‌లో సంచలనం రేపుతున్న చిత్రం.. బేబి. చిన్న సినిమాగా రిలీజై పెద్ద రేంజికి వెళ్తున్న ఈ చిత్రం ఇప్పటికే రూ.40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. వర్షాల ప్రభావంలో కూడా ఈ సినిమా నిలకడగా వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాలో కథ.. పాత్రలు చాలా ట్రెండీగా ఉండటం వల్ల.. రియలిస్టిగ్గా అనిపించడం వల్ల యూత్ బాగా కనెక్టవుతున్నారన్నది నిజం.

నిజానికి ఈ కథ కూడా పూర్తి కల్పితం ఏమీ కాదు. తమిళనాడులోని సేలంలో జరిగిన ఒక వాస్తవ ఉదంతం ఆధారంగా రైటర్ కమ్ డైరెక్టర్ సాయిరాజేష్ ఈ కథను తీర్చిదిద్దుకోవడం విశేషం. ఒక ఇంటర్వ్యూలో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. సేలంలో కొన్నేళ్ల కిందట ఒక అమ్మాయిని ఇద్దరు అబ్బాయిలు కలిసి కిరాతకంగా హత్య చేశారు. ఆ ఇద్దరూ ఆమెను ప్రేమించిన వాళ్లు కావడం విశేషం.

ఇంజినీరింగ్ చదివే ఒక అమ్మాయి తన క్లాస్ మేట్‌తోనే కాక.. ఒక ఆటోడ్రైవర్‌తో ఒకేసారి స్నేహం చేసింది. ప్రేమలోనూ పడింది. ఒకరికి తెలియకుండా ఒకరితో కొన్ని రోజులు కలిసి ప్రయాణం చేశాక.. అనుకోకుండా ఆ విషయం ఆ ఇద్దరు అబ్బాయిలకు తెలిసిపోయింది. దీంతో వాళ్లిద్దరూ కసితో రగిలిపోయి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ ఉదంతం గురించి తెలిసి.. హత్యకు సంబంధించి విజువల్స్ చూసి సాయిరాజేష్ కదిలిపోయారట.

అందులో హత్య అంశాన్ని పక్కన పెట్టి అమ్మాయి పర్సప్షన్ ఏమై ఉంటుంది అనే ఆలోచనతో ఆ ముగ్గురి పాత్రలనే తీసుకుని కథ అల్లుకున్నట్లు సాయిరాజేష్ తెలిపాడు. ఆ కథను ఉన్నదున్నట్లుగా తీస్తే సొసైటీకి చెడు సందేశం ఇచ్చినట్లుగా ఉంటుందనే ఉద్దేశంతోనే అమ్మాయిని అబ్బాయిలిద్దరూ చంపినట్లు చూపించలేదని.. కథనం.. పతాక ఘట్టం వేరే రకంగా చూపించానని సాయిరాజేష్ తెలిపాడు.