ఏకై వచ్చి మేకై కూర్చున్న త్రివిక్రమ్

టాలీవుడ్లో చాలా ఏళ్లుగా చర్చల్లో ఉన్న మెగా ప్రాజెక్ట్ హిరణ్య కశ్యప మరోసారి తెరపైకి వచ్చింది. అమెరికాలో కామిక్ కాన్ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశాడు. అంతే కాక ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రిప్టు అందిస్తున్న విషయం కూడా వెల్లడించాడు. దీంతో అందరి చూపూ గుణశేఖర్ వైపు మళ్లింది. ‘హిరణ్య కశ్యప’ అనే సినిమాను ముందు అనౌన్స్ చేసింది గుణశేఖర్.

‘రుద్రమదేవి’ తర్వాత ఆయన చేయాలనుకున్న ప్రాజెక్టు కూడా ఇదే. ఆ సినిమాలో ముఖ్య పాత్ర చేసిన రానా దగ్గుబాటినే లీడ్ రోల్‌లోకి తీసుకోవాలనుకున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్లో ఈ సినిమా తీయడానికి ముందుకు వచ్చింది. అంతా ఓకే అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా గుణశేఖర్ ఈ ప్రాజెక్టు నుంచి బయటికి వచ్చేశాడు. వేరే దర్శకుడితో సినిమా చేయనున్నట్లు గత ఏడాది ఆఖర్లో నిర్మాత సురేష్ బాబు ప్రకటించారు.

కట్ చేస్తే ఇప్పుడు రానా ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేయగానే.. గుణశేఖర్ వేసిన ట్వీట్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దేవుడి మీద సినిమాలు తీయడం ఓకే కానీ.. మనం అనైతికంగా ఏదైనా చేస్తే దేవుడు చూస్తూ ఉంటాడని మరిచిపోవద్దు అంటూ గుణశేఖర్ ఒక నర్మగర్భమైన ట్వీట్ వేశారు. తనను పక్కన పెట్టి ‘హిరణ్యకశ్యప’ను చేయబోతుండటం మీదే ఈ ట్వీట్ అని అందరూ భావిస్తున్నారు. కాగా గతంలో ఒక ఇంటర్వ్యూలో గుణశేఖర్ మాట్లాడుతూ.. ‘హిరణ్య కశ్యప’కు శ్రీకారం చుట్టిందే తను అనే విషయం చెబుతూ.. దాని కోంస తానెంత కష్టపడింది కూడా వివరించారు.

త్రివిక్రమ్ ఈ ప్రాజెక్టులోకి రావడం గురించి మాట్లాడుతూ.. తాను నిజానికి సాయిమాధవ్ బుర్రాను డైలాగ్ రైటర్‌గా తీసుకున్నానని.. కానీ త్రివిక్రమ్ తనకు తానుగా ఈ చిత్రానికి మాటలు రాస్తానని ముందుకు వచ్చాడని.. ఐతే బ్రహ్మాండం కదా అనుకున్నానని.. కానీ తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని గుణ అన్నారు. ఆయన మాటల్ని బట్టి చూస్తుంటే.. త్రివిక్రమ్ మాటల రచయితగా ఈ ప్రాజెక్టులోకి ప్రవేశించి.. మొత్తం స్క్రిప్టు మీద కంట్రోల్ తెచ్చుకున్నారని.. ఈ క్రమంలోనే వెర్షన్ మారిపోయి గుణశేఖర్ ప్రాజెక్టు నుంచే తప్పుకున్నాడని అర్థమవుతోంది. చూస్తుంటే త్రివిక్రమ్ ఏకై వచ్చి మేకైపోయినట్లుగా అనిపిస్తోంది.