నితిన్ కోసం వెళ్తాడు.. మెగా ఫంక్షన్లకు రాడు

మెగా ఫ్యామిలీలో కొంత విరామం తర్వాత మళ్లీ ఓ శుభాకార్యం జరిగింది. నాగబాబు ముద్దుల కూతురు నిహారికకు.. గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ వెంకట చైతన్యతో గురువారం నిశ్చితార్థం జరిగింది.

కరోనా-లాక్ డౌన్ నేపథ్యంలో సాధ్యమైనంత సింపుల్‌గా ఈ వేడుకను జరిపించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ మెగా ఫ్యామిలీ స్థాయికి తగ్గ గ్రాండియర్ కనిపించింది వేడుకలో. బయటి వాళ్లెవ్వరినీ పిలవకుండా పూర్తిగా ఇరు కుటుంబాల వాళ్లే ఈ వేడుకలో పాల్గొన్నారు.

మెగా ఫ్యామిలీ అంటే చిన్నది కాదు.. కాబట్టి వారి పరివారం గట్టిగానే కనిపించింది. నాగబాబు, చిరు దంపతులకు తోడు.. మెగా ఫ్యామిలీ తర్వాతి తరం వాళ్లంతా ఈ వేడుకలో కనిపించారు.

రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ సతీమణులతో వేడుకలో పాల్గొన్నారు. సుశ్మిత, శ్రీజ కూడా తమ భర్తలతో వేడుకకు వచ్చారు. మిగతా సింగిల్ బ్యాచ్ అంతా కూడా వేడుకలో సందడి చేసింది. ఐతే అందరూ ఉన్నా మరోసారి ఒక వ్యక్తి లేని లోటు స్పష్టంగా కనిపించింది.

ఆ వ్యక్తి పనవ్ కళ్యాణ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బయటి వాళ్ల శుభాకార్యాలకు, వేరే వేడుకలకు హాజరయ్యే పవన్.. కుటుంబంలో జరిగే వేడుకలకు హాజరవడం అరుదు. ఇలా చాలా వేడుకలు, ఫ్యామిలీ గెట్ టు గెదర్‌లకు పవన్ దూరమయ్యాడు.

ఈ మధ్యే నితిన్ పెళ్లికి కూడా వెళ్లిన పవన్.. నిహారిక నిశ్చితార్థానికి రాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. బహుశా పెళ్లికి వెళ్తే చాలని అనుకుని ఉంటాడేమో కానీ.. నిశ్చితార్థం తన అన్న కూతురిది కాబట్టి ఈ వేడుకలోనూ పవన్ ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.