మహేష్ ఫ్యాన్స్ కోరిక తీరుతోంది

ఏడాది నుంచి టాలీవుడ్లో రీరిలీజ్‌ల హంగామా నడుస్తోంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ సినిమా ‘తొలి ప్రేమ’ ఎలాంటి సందడి చేసిందో తెలిసిందే. అసలీ రీ రిలీజ్ హంగామా శ్రీకారం చుట్టుకుందే మహేష్ బాబు సినిమా ‘పోకిరి’తో. గత ఏడాది ఆగస్టు 9న మహేష్ పుట్టిన రోజు పుట్టిన రోజును పురస్కరించుకుని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ‘పోకిరి’ స్పెషల్ షోలతో మామూలు హడావుడి చేయలేదు. అప్పటిదాకా రీరిలీజ్‌లు అంటే ఐదో పదో థియేటర్లలో షోలు వేసేవారు.

కానీ ఆ చిత్రానికి మాత్రం వందల్లో షోలు ప్లాన్ చేశారు. కలెక్షన్లు కూడా అనూహ్యంగా రూ.2 కోట్లకు దగ్గరగా వచ్చాయి. అప్పుడు మహేష్ అభిమానులు చేసిన సందడి చూసి మిగతా స్టార్ హీరోల ఫ్యాన్స్‌లోనూ పంతం వచ్చింది. అందరూ ఆ ట్రెండును అనుసరించారు. మహేష్ అభిమానులు సైతం తర్వాత ‘ఒక్కడు’ స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. దానికీ మంచి స్పందనే వచ్చింది. 

ఐతే సూపర్ స్టార్ ఫ్యాన్స్‌లో ఎక్కువమంది రీ రిలీజ్ కోరుకుంటున్న సినిమా ‘బిజినెస్‌మ్యాన్’ అనే చెప్పాలి. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో మహేష్ పాత్ర మామూలుగా ఉండదు. చాలా ఫెరోషియస్‌గా, పవర్ ఫుల్‌గా కనిపించే ఆ పాత్రను మహేష్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో సూర్య భాయ్ ఎప్పుడూ  చర్చనీయాంశంగానే ఉంటూ ఉంటాడు.

సినిమా అంతా మహేష్ వన్ మ్యాన్ షోలా కనిపించే ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలన్న అభిమానుల కోరిక తీరబోతోంది. ఈసారి మహేష్ పుట్టిన రోజుకు ఆ చిత్రాన్నే స్పెషల్ షోలుగా వేయబోతున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా వచ్చేసింది. ఇది సూపర్ ఫ్యాన్స్‌కు మాంచి ఉత్సాహాన్నిస్తోంది. వచ్చే ఆగస్టు 9న ‘పోకిరి’ని మించి వాళ్లు ఈ సినిమాకు సందడి చేస్తారనడంలో సందేహం లేదు. రీ రిలీజ్‌ల్లో కొత్త రికార్డులు కూడా నమోదు కావచ్చు.