ఓవర్సీస్ బ్రో చుట్టూ 4 చిక్కుముళ్ళు

ఇంకో ఇరవై రోజుల్లో విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ బ్రోకి సరైన రీతిలో హంగామా మొదలుకాలేదు. టైం చాలా తక్కువగా ఉన్నా నిర్మాత సంస్థ ఇంకా పూర్తి స్థాయి పబ్లిసిటీ మొదలుపెట్టలేదు. బిజినెస్ వంద కోట్ల పైనే జరిగిందన్న వార్తల నేపథ్యంలో ఎంత పవర్ స్టార్ మూవీ అయినా సరే ప్రమోషన్లు చాలా కీలకం. వినోదయ సితం రీమేక్ గా రూపొందిన బ్రో తాలూకు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో దర్శకుడు సముతిరఖని తెగ బిజీగా ఉండటంతో ఇటుపక్క ఫోకస్ చేయలేకపోతున్నారు. అయితే ఓవర్సీస్ వ్యవహారాలు ఈసారి అంత ఆషామాషీగా ఉండబోవడం లేదు.

మొత్తం నాలుగు చిక్కులు విదేశాల్లో బ్రోకు సవాల్ విసరబోతున్నాయి. అందులో జూలై 21  రిలీజవుతున్న హాలీవుడ్ మూవీ ‘ఓపెన్ హెయిమర్’ మొదటిది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన న్యూ క్లియర్ యాక్షన్ డ్రామా మీద ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. యుఎస్, యుకె లాంటి దేశాల్లో బుకింగ్స్ భీభత్సంగా జరుగుతున్నాయి. కనీసం మూడు వారాలకు సరిపడా అగ్రిమెంట్లతో ప్రీమియర్ థియేటర్లు ఎగబడుతున్నాయి. అదే రోజు వస్తున్న ‘బార్బీ’ సైతం చాలా క్రేజీగా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. నోలన్ తో పోటీకి దిగిందంటే విషయం బలంగా ఉన్నట్టే.

వీటిని రెండు వారాల ముందే వస్తున్న టామ్ క్రూజ్ కొత్త సాహస చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికొనింగ్ ఛాప్టర్ వన్’ పైవాటికి ఏ మాత్రం తీసిపోని  హైప్ తో రచ్చే చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇవి చాలక బ్రో వచ్చే రోజునే కరణ్ జోహార్ ఫ్యామిలీ గ్రాండియర్ ‘రాకీ రాణి ప్రేమ్ కి కహాని’ని ధర్మా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా ఎన్ఆర్ఐ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని గ్రాండ్ రిలీజ్ కి సెట్ చేసుకుంది. ఇంత కాంపిటీషన్ మధ్య బ్రో రెండు మిలియన్ నుంచి రెండు మిలియన్ మార్క్ అందుకోవడం సవాలే. తెలుగు రాష్ట్రాల వరకు ఇవి అంత ఇబ్బంది కలిగించకపోవచ్చు