టాక్సిక్ ట్రైలర్ మీద కోట్ల కళ్లున్నాయి

కెజిఎఫ్ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ సాధించాక హీరో యష్ వేగంగా సినిమాలు చేయాలని తొందరపడలేదు. కోరుకుంటే స్టార్ డైరెక్టర్లతో చేసే ఛాన్స్ ఉన్నా కథ నచ్చితే తప్ప ఒప్పుకోనని భీష్మించుకు కూచున్నాడు. దీని వల్ల కొన్ని క్రేజీ ఆఫర్స్ చేజారాయనే టాక్ బెంగళూరు వర్గాల్లో ఉంది. అయినా సరే తనకొచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ కాపాడుకునేందుకు యష్ ఎంత టైం ఖర్చు పెట్టేందుకైనా సిద్ధంగా ఉన్నాడు. అందుకే దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పేరు కన్నా యష్ పేరు మీదే మార్కెటింగ్ జరుగుతోంది.

ఆగస్ట్ 8 టాక్సిక్ ట్రైలర్ రానుంది. బెంగళూరులో చాలా గ్రాండ్ ఈవెంట్ ద్వారా లాంచ్ చేయబోతున్నారు. దీని మీద కోట్ల కళ్ళు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ వర్గాలు టాక్సిక్ పట్ల విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నాయి. దురంధర్ తర్వాత ఆ స్థాయిలో హిందీ బాక్సాఫీస్ కు ఊపు తెచ్చిన సినిమా లేదు. ఒకటి రెండు బాగానే ఆడాయి కానీ కనీసం అయిదు వందల కోట్లు వసూలు చేసే బొమ్మ గత మూడు నెలల్లో రాలేదు. అది టాక్సిక్ వల్లే సాధ్యమవుతుందని వాళ్ళ నమ్మకం.

కేవలం ఒక వీడియోగా జనాలు దీన్ని చూడటం లేదు. డిస్ట్రిబ్యూటర్లు పెడుతున్న వందల కోట్ల పెట్టుబడికి న్యాయం జరుగుతుందనే మొదటి హామీ ట్రైలర్ లో దక్కాలి. అంతే కాదు ఓపెనింగ్స్ లో చాలా కీలక పాత్ర పోషించే మొదటి రెండు రోజులకు సంబంధించిన కలెక్షన్లు బలంగా రావాలంటే, ఫ్యాన్స్ కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా టికెట్ రేట్లు ఎంత ఉన్నా మొదటి వారంలోనే చూసేయాలన్నంత హైప్ తెచ్చుకోవాలి. అది ట్రైలర్ తోనే సాధ్యం.

అందుకే అది ఎలా వచ్చిందన్న ఎగ్జైట్ మెంట్ అందరిలోనూ ఉంది. పైగా కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, నయనతార అంటూ క్యాస్టింగ్ మొత్తం లేడీస్ తో నింపేసిన గీతూ మోహన్ దాస్ ఇప్పటిదాకా వదిలిన పాటల్లో బోల్డ్ రొమాన్స్ పెట్టేశారు. యాక్షన్ బ్లాక్స్ దాచి పెట్టారు. ట్రైలర్ లో ఏమేరకు రివీల్ చేస్తారో చూడాలి. ఆగస్ట్ 26 ఎంతో దూరంలో లేదు. కేవలం పాతిక రోజుల్లో టాక్సిక్ సునామి థియేటర్లలో అడుగు పెడుతుంది. రవి బస్రూర్ సంగీతం మెయిన్ అట్రాక్షన్ గా చెబుతున్నారు.