ఒక్క పోస్టు లేదు… గంటల్లో మిలియన్ మార్కు

సోషల్ మీడియా వరకు చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా యాక్టివ్ గా ఉన్నది ఒక్క ట్విట్టర్ లో మాత్రమే. అది కూడా రాజకీయాలకు పరిమితం చేస్తూ చాలా అరుదుగా సినిమాలకు సంబందించిన విషయాలను ప్రస్తావిస్తూ ఉంటారు. జనసేన అధ్యక్షుడిగా అధికార పార్టీ పాలన, రాష్ట్ర సమస్యలు, పార్టీ తరఫున  తాను చేస్తున్న సహాయాలు మాత్రమే అందులో ఉండేవి. అయితే ఈ మధ్య కాలంలో ట్విట్టర్ ఓనర్ ఎలాన్ మస్క్ చిత్ర విచిత్రమైన మార్పులు తీసుకొస్తూ ఉండటంతో చిరాకొచ్చిన నెటిజెన్లు ఇన్స్ టా గ్రామ్, ఫేస్ బుక్ లాంటి వాటికి షిఫ్ట్ అవుతున్నారు.

ఈ నేపథ్యంలో పవన్ కూడా ఇన్స్ టా అకౌంట్ ఓపెన్ చేశారు. వెరిఫికేషన్ బ్యాడ్జ్ కూడా వెంటనే వచ్చింది. ఇలా మొదలుపెట్టడం ఆలస్యం ఫ్యాన్స్ గంపగుత్తగా వచ్చి యాడవుతున్నారు. కేవలం 6 గంటల 20 నిమిషాల్లో మిలియన్ మార్క్  దాటిపోయింది. ఇంత వేగంగా ఏ టాలీవుడ్ హీరో ఇన్స్ టాలో ఈ మైలురాయిని అందుకోలేదు. ఇంతా చేసి పవన్ ఒక్కటంటే ఒక్క పోస్టు పెట్టలేదు. జనసేన గురించి చేస్తారా, లేక బ్రో గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కేవలం పవర్ స్టార్ బ్రాండ్ ఆన్ లైన్ లో ఇలాంటి రికార్డులు తెచ్చి పెట్టడం మాములు విషయం కాదు.

ఇప్పటిదాకా ఇన్స్ టా ఖాతా లేనివాళ్లు అప్పటికప్పుడు చేరిపోయి మరీ లక్షల్లో నెంబర్ జోడిస్తున్నారు. ఈ లెక్కన వారం పదిరోజులు దాటితే హయ్యెస్ట్ ఫాలోయర్స్ వచ్చినా ఆశ్చర్యం లేదు. బ్రో ఈ నెల 28 విడుదల కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టారు. టీజర్ కు బాగా రీచ్ వచ్చింది. మొదటి ఆడియో సింగల్ ని అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన బ్రో తమిళ రీమేకే అయినప్పటికీ బిజినెస్ పరంగా ట్రేడ్ లో భారీ డిమాండ్ ఉంది. రేపో ఎల్లుండో అన్ని ఏరియాలను ఫైనల్ చేసి క్లోజ్ చేయబోతున్నారు