ప్రభాస్ మిత్రులకు ఈ ముద్ర మంచిదేనా?

కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయమే నిజమైంది. 2019కు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ, ఆయన పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ను ఎన్నికల అస్త్రంగా వాడుకున్న వైసీపీ.. ఈసారి జగన్ సినిమాను తెరపైకి తీసుకురాబోతోంది. ఆయనకు అధికారం తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషించిన పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర-2’ రాబోతోంది.

‘యాత్ర’ను రూపొందించిన మహి.వి.రాఘవే ఈ చిత్రాన్ని కూడా రూపొందించబోతున్నాడు. తమిళ నటుడు జీవా ఇందులో జగన్ పాత్ర పోషిస్తాడని.. కొన్ని సన్నివేశాల్లో వైఎస్‌గా మమ్ముట్టినే కనిపించబోతున్నాడని అంటున్నారు. ఐతే ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో జగన్ మీద సినిమా తీయడం కరెక్టేనా.. ‘యాత్ర’ను రిసీవ్ చేసుకున్నట్లే దీన్ని కూడా జనాలు తీసుకుంటారా అనే విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ఈ చిత్రాన్ని ‘యువి’ క్రియేషన్స్ వాళ్లు నిర్మిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్థ ప్రభాస్ ఆప్త మిత్రులైన వంశీ, ప్రమోద్‌, విక్కీలది అన్న సంగతి తెలిసిందే. ‘యువి’ని ప్రభాస్ సొంత సంస్థ లాగే చూస్తారు అందరూ. ఏపీ సీఎం జగన్‌తో ప్రభాస్ మిత్రులకు సన్నిహిత సంబంధాలున్నాయని అంటారు. వారిదీ జగన్ సామాజిక వర్గమే. కానీ వీరి బంధం గురించి ఇప్పటిదాకా బయటికి వెల్లడి కాలేదు. సినీ పరిశ్రమలో ఇలాంటి రాజకీయ బంధాలు బయట పడటం మంచిది కాదన్న ఉద్దేశంతో ఓపెన్ కారు.

ఎందుకంటే ప్రభుత్వాలు ఎప్పుడు మారతాయో తెలియదు కాబట్టి.. ఇలా ఒక పార్టీ రంగు పూసుకుంటే కొన్నిసార్లు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అందుకే తెర వెనుక ఎలాంటి బంధం ఉన్నా పైకి న్యూట్రల్‌గా కనిపించడానికి చూస్తారు. నిర్మాతలకు అయితే ఇది మరీ అవసరం. కానీ యువి వాళ్లు ఇప్పుడు ‘యాత్ర-2’ను నిర్మించడం ద్వారా వైసీపీ రంగును పులిమేసుకుంటున్నట్లే చెప్పాలి. ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ వైసీపీ మద్దతుదారులుగా ముద్ర వేసుకుంటే.. ప్రభాస్‌కు సైతం కొంత ఆ రంగు అంటుకోవచ్చు. దీన్ని ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో చూడాలి. మరోవైపు ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య వైసీపీ టికెట్ మీద నరసాపురంలో పోటీ చేస్తుందనే ఊహాగానాలు కూడా నడుస్తున్నాయి. అదే నిజమైతే ప్రభాస్‌ను వైసీపీ మనిషిగా చూస్తారేమో జనాలు. ఇది మంచో చెడో కాలమే నిర్ణయించాలి.