OG వేగంతో వీరమల్లుకు గాయం  

చూస్తుండగానే ఓజి షూటింగ్ యాభై శాతం పూర్తయిపోయింది. ఇవాళ టీమ్ అధికారికరంగా యూనిట్ సభ్యులతో కూడిన ఒక ఫోటోని పోస్ట్ చేసి మరీ ప్రకటించింది. నిన్నా మొన్నా స్టార్ట్ అయినట్టుగా ఉన్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఇంత వేగంగా పూర్తి చేయడంలో స్క్రిప్ట్ పట్ల దర్శకుడు సుజిత్ కున్న క్లారిటీతో పాటు హీరో పవన్ కళ్యాణ్ సహకారం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది డిసెంబర్ లోనే విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒకవేళ మిస్ అయినా జనవరిలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. ప్రాజెక్ట్ కె రాక కన్ఫర్మ్ అయ్యాక నిర్ణయం తీసుకోబోతున్నారు.

ఇదంతా బాగానే ఉంది ఈ ఓజి వేగం వీరమల్లుకి గాయంగా మారింది. చాలా నెలల నుంచి కనీస అప్డేట్స్ రావడం లేదు. దర్శకుడు క్రిష్ బయట కనిపించడం మానేశారు. ఎక్కడైనా వేరే సినిమా వేడుకల్లో కనిపిస్తే అడుగుదామంటే ఆ అవకాశమే దొరికితేగా. నిర్మాత ఏఎం రత్నం అడపాదడపా దర్శనమిస్తున్నా మీడియాతో మాత్రం నో ఛాట్. హైదరాబాద్ లో వేసిన సెట్లు తీసేసి గుంటూరు లేదా విజయవాడ పరిసరాల్లో వాటినే తిరిగి వేయించి పూర్తి చేసేలా క్రిష్  ని పురమాయించారని ఇన్ సైడ్ టాక్. జనసేన వారాహి యాత్ర కోసం ఈ సర్దుబాటు తప్పలేదని వినికిడి.

సరే ఎప్పుడు పూర్తి చేసినా విడుదల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. ఓజి పూర్తయ్యాక పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ కు డేట్లు ఇస్తారు. మధ్యలో వీరమల్లుకు కొన్ని కాల్ షీట్స్ ఇవ్వొచ్చు. షూట్ పూర్తయినా పోస్ట్ ప్రొడక్షన్ ఎక్కువ డిమాండ్ చేసే ప్రాజెక్టు కావడంతో క్రిష్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. 2024 దసరా లేదా దీపావళి కన్నా ముందు రిలీజ్ చేసే సూచనలు తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి నుంచి ఎలక్షన్ల హడావిడిలో పవన్ దొరకడం కష్టం కాబట్టి ఏదున్నా ఆ లోగానే గుమ్మడికాయ కొట్టేయాలి. బ్రో విడుదలయ్యాక ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారేమో చూడాలి