జేడీ చక్రవర్తిపై విష ప్రయోగం

90వ దశకంలో హీరోగా ఒక వెలుగు వెలిగాడు జేడీ చక్రవర్తి. హీరో వేషాలు తగ్గిపోయాక అప్పుడప్పుడూ విలన్ వేషాలు వేస్తూ.. అలాగే డైరెక్షన్ కూడా చేస్తూ కొన్నేళ్లు లైమ్ లైట్లోనే ఉన్నాడతను. కానీ ఈ మధ్య ఫిలిం ఇండస్ట్రీలో అతను పెద్దగా కనిపించడం లేదు. అప్పుడప్పుడూ యూట్యూబ్ ఛానెళ్ల ఇంటర్వ్యూల్లో మెరుస్తున్న జేడీ.. తన మీద విషప్రయోగం జరిగిన సంచలన విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టాడు. ఆ ప్రయోగం చేసింది ఎవరు.. ఎందుకు చేశారు అని చెప్పలేదు కానీ.. ఎనిమిది నెలల పాటు తన మీద విష ప్రయోగం జరిగినట్లు మాత్రం వెల్లడించాడు. దాని గురించి అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

‘‘నాకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కానీ కొన్ని రోజుల కిందట నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది. ఊపిరి పీల్చుకోవడం చాలా కష్టమైంది. దీంతో డాక్టర్లను కలిశా. కానీ ఎవ్వరూ నా సమస్య ఏంటో కనుక్కోలేకపోయారు. విదేశాల్లో కూడా చూపించినా కూడా ఫలితం లేకపోయింది. ఒక దశలో నా పరిస్థితి కష్టమే అని డాక్టర్లు చెప్పేశారు. ఆ టైంలో నా ఫ్రెండ్ చెప్పాడని నాగార్జున అనే డాక్టర్ దగ్గరికి వెళ్లాను. ఆయన నన్ను టెస్ట్ చేసి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావని అడిగారు. నాకు అలాంటి అలవాటే లేదని చెప్పాను. నేను ఒకప్పుడు ఒక కషాయం తాగేవాడిని. ఆరోగ్యం కోసమని నాతో ఒక వ్యక్తి అది తాగించేవాడు.

ఒకసారి ఖాసిం అనే నిర్మాత ఆ కషాయం తాగుతానన్నాడు. అది తాగాక రెండు రోజులు తీవ్ర జ్వరం వచ్చింది. నాకా కషాయం ఇస్తున్న వ్యక్తికి విషయం చెబితే.. నీకోసం చేసిందాన్ని వేరే వాళ్లకు ఎందుకు ఇచ్చావు అని కోప్పడ్డాడు. మా మధ్య దాని మీద పెద్ద గొడవ జరిగింది. చివరికి ఆసుపత్రిలో తేలిందేంటంటే నాకు ఎనిమిది నెలల పాటు స్లో పాయిజన్ ఇచ్చారు. అందు వల్లే నాకు శ్వాస కోశ ఇబ్బందులు వచ్చాయి. దాన్ని వేరే వ్యక్తి తాగితే అతడికి మందు కొట్టే అలవాటు ఉండటం వల్ల తన శరీరం తట్టుకోలేకపోయింది’’ అని జేడీ వెల్లడించాడు.