దృశ్యం 3 వెంకీ చేయడం లేదా

ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ అనే కొత్త కాన్సెప్ట్ పరిచయం చేసిన దృశ్యంకున్న కల్ట్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మాములుగా హీరో లేదా విలన్ చేసే మర్డర్ల చుట్టూ కథలు రాసే సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తూ దర్శకుడు జీతూ జోసెఫ్ తీసుకొచ్చిన ఈ ట్రెండ్ అన్ని భాషల్లోనూ గొప్ప ఆదరణ అందుకుంది. మొదటి భాగం కేరళలో పాత రికార్డులు బద్దలు కొట్టి కొంత తగ్గుతున్న మోహన్ లాల్ ఇమేజ్ ని తిరిగి నెంబర్ వైపు తీసుకెళ్లిన ఘనత దీనిదే. తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసినప్పుడు మంచి సక్సెస్ అందుకున్నారు. హిందీలో అజయ్ దేవగన్ కూ పెద్ద హిట్టు పడింది.

ఇలాంటి ట్రెండ్ సెట్టర్ సీక్వెల్ దృశ్యం 2 తెలుగు మలయాళం వెర్షన్లు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ కావడం ఫ్యాన్స్ ని కొంత నిరాశపరిచినా కంటెంట్ పరంగా బాగానే ఆకట్టుకున్నాయి. అయితే హిందీ దృశ్యం 2 తెలివిగా థియేట్రికల్ విడుదలను ఎంచుకుని భారీ లాభాలు అందుకుంది. గత ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు దృశ్యం 3 కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిందీ మళయాలం రెండూ ఒకేసారి సమాంతరంగా షూటింగ్ చేయాలని జీతూ జోసెఫ్ నిర్ణయించుకున్నట్టుగా తెలిసింది. అయితే తెలుగు మాత్రం వాటితో పాటు ఉండదని వినికిడి

ప్రస్తుతం వెంకటేష్ సైంధవ్ లో చాలా బిజీగా ఉన్నారు. క్రమం తప్పకుండ రెగ్యులర్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుగుతూనే ఉంది. బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్ విలన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో చైల్డ్ సెంటిమెంట్ కూడా ఉంది. అయితే దీపావళి లోగా చిత్రీకరణ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న దర్శకుడు శైలేష్ కొలను ఈ కారణంగానే వెంకీను గుబురు గెడ్డంతో ఉన్న లుక్ ని కొనసాగిస్తున్నారు. ఇది దృశ్యం సిరీస్ కి సెట్ కాదు. అందుకే ప్రస్తుతానికి వద్దనుకున్నారో లేక దృశ్యం 2కి భారీ స్పందన రాకపోవడం వల్ల డ్రాప్ అయ్యారో ఇప్పటికి సస్పెన్స్