నాయుడు నాయగం కావాలి కమల్ సార్  

స్టార్ హీరోల సినిమాలు ఆగిపోతే అభిమానులు పడే బాధ వర్ణనాతీతం. అందులోనూ అవి క్రేజీ కాంబినేషన్లైతే చెప్పేదేముంది. కమల్ హాసన్ కి అలాంటివి రెండున్నాయి. మొదటిది మరుద నాయగం. 1997లో మొదలుపెట్టి మూడేళ్ల నిర్మాణం అయ్యాక రకరకాల కారణాలతో ఆపేశారు. ఎలిజిబెత్ మహారాణి దీని ఓపెనింగ్ కి రావడం సంచలనం. అప్పట్లోనే నలభై కోట్ల బడ్జెట్ ని కేటాయించుకుని అవసరమైతే అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టేందుకు పలు హాలీవుడ్ కంపెనీలతో టైఅప్ కూడా చేసుకున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఎంత ట్రై చేసినా లాభం లేకపోయింది.

అందులో నటించిన అమ్రిష్ పూరి, విష్ణువర్ధన్ లాంటి వాళ్ళు కాలం కూడా చేశారు. సత్యరాజ్, నాజర్, గౌతమి, మాధురి దీక్షిత్ లు ఇప్పటికీ ఇందులో భాగం కావడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇళయరాజా కంపోజింగ్ లో పాటలు రికార్డు చేశారు. ఒకటి రెండు యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి. ఒక చారిత్రాత్మక కథను ప్రేక్షకులకు స్వీయ దర్శకత్వంలో చెప్పాలన్న కమల్ తపన ఇప్పటిదాకా తీరలేదు. అభిమానులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడంటే ప్యాన్ ఇండియాలంటూ ఊగిపోతున్నాం కానీ మరుదనాయగం దానికి పునాది.

దీంతో పాటు కమల్ మొదలుపెట్టి ఆపేసిన శభాష్ నాయుడు కూడా వెయిటింగ్ లిస్టులో ఉంది. శృతి హాసన్ ని క్యాస్టింగ్ లో భాగం చేసి కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. దశావతారంలో సిబిఐ ఆఫీసర్ నాయుడు పాత్రనే ఫుల్ లెన్త్ రోల్ గా మార్చి స్క్రిప్ట్ రాసుకున్నారు. ఇదీ అనారోగ్యం వల్ల ఆపేశారు. విక్రమ్ ఇచ్చిన బ్లాక్ బస్టర్ ఊపుతో కొత్త ఉత్సాహం తెచ్చుకున్న కమల్ ప్రస్తుతం ఇండియన్ 2, మణిరత్నం సినిమా, తెగింపు దర్శకుడు వినోత్ తో ప్రాజెక్ట్ కమిటయ్యారు. కనీసం ఇవయ్యాక అయినా మరుదనాయగం, శభాష్ నాయుడు బయటికి రావాలని సగటు మూవీ లవర్స్ కోరిక