ఆత్మహత్య ఆలోచనలో పవిత్ర లోకేష్!

పవిత్ర లోకేష్.. కొన్నేళ్ల ముందు వరకు ఈ కన్నడ క్యారెక్టర్ నటి పేరు కూడా చాలామందికి తెలియదు. సీనియర్ నటుడు నరేష్‌తో ఆమె బంధం చర్చనీయాంశంగా ఆమెకు వచ్చిన పాపులారిటీనే వేరు. ‘సమ్మోహనం’ సినిమాలో భార్యాభర్తలుగా కలిసి నటించిన సమయంలో వీరి మధ్య స్నేహం మొదలైంది. తర్వాత ఇద్దరూ కలిసి ప్రయాణం సాగిస్తున్నారు.

అధికారికంగా ఇద్దరికీ పెళ్లి జరిగిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు కానీ.. వాళ్లయితే అందరికీ భార్యాభర్తల్లాగే కనిపిస్తున్నారు. తన మొదటి భర్తకు దూరమైన పవిత్ర.. తన నివాసాన్ని కూడా హైదరాబాద్‌కే మార్చేసింది. నరేష్‌తో కలిసి ఆమె నటించిన ‘మళ్ళీ పెళ్ళి’ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరి నిజ జీవిత బంధం నేపథ్యంలోనే ఈ సినిమా సాగినట్లు కనిపిస్తుండటం అందుకు కారణం.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసి పవిత్ర.. నరేష్ తన జీవితంలోకి వచ్చాక జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి మాట్లాడింది. ఒక దశలో తాను ఆత్మ:హత్య చేసుకోవాలని కూడా చూశానని.. అలాంటి తన ఆలోచనలను పూర్తిగా మార్చి.. మళ్లీ సంతోషంగా జీవించేలా చేసింది నరేషే అని ఆమె వెల్లడించింది. ‘‘నరేష్ ఎంత సీరియస్ విషయమైనా తేలిగ్గా తీసుకుంటారు. దాన్నుంచి బయటపడేందుకు సీరియస్‌గా ఆలోచిస్తారు.

కానీ నేను చిన్న చిన్న విషయాలను కూడా సీరియస్‌గా తీసుకునే రకం. నరేష్‌కు, నాకు మధ్య మంధాన్ని ఆయన కుటుంబం అంగీకరించింది. మా విషయంలో కొన్ని సంఘటనలు జరిగాయి. కొందమంది నా క్యారెక్టర్‌ను దెబ్బ తీసి నా మీద, కెరీర్ మీద చెడు ప్రభావం చూపించాలని ప్రయత్నించారు. నాకు ఒక దశలో ఆత్మహత్య ఆలోచనలు కలిగాయి. కానీ ఆ దశ నుంచి బయటికి వచ్చానంటే నరేష్ నా కోసం బలంగా నిలవబట్టే. నన్ను ఆయన జాగ్రత్తగా చూసుకుంటారు. ఒక మహిళగా అంతకంటే నాకు ఏం కావాలి? నరేష్‌ను, మా అమ్మనీ చూసుకుంటూ ఇకపైనా సినిమాల్లో కొనసాగుతా’’ అని పవిత్ర చెప్పింది.