స్టార్లు లేకుండానే 100 కోట్లు లాగేశాయి

ఈ వేసవి టాలీవుడ్ కు సంబంధించి ఒక హిట్టు నాలుగు ఫ్లాపులతో చప్పగా ఉంది కానీ ఇతర భాషల్లో అసలు స్టార్లే లేకుండా వంద కోట్ల సినిమాలు నమోదవుతున్నాయి. అందులో మొదటిది మలయాళంలో వచ్చిన 2018. అయిదేళ్ల క్రితం కేరళను ఊపేసిన వరదల నేపథ్యంలో దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్ రూపొందించిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ కి మల్లువుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం పదకొండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ సాధించి వామ్మో అనిపించేసింది.

పులి మురుగన్, లూసిఫర్ లకు మాత్రమే సాధ్యమైన ఈ ఫీట్ ని అలవోకగా సాధించి డబుల్ సెంచరీని టార్గెట్ గా పెట్టుకుంది. ఇక వివాదాలే కేంద్రంగా రిలీజైన ది కేరళ స్టోరీ మూడో వారం రాకుండానే 150 కోట్ల దగ్గరగా వెళ్లి మతులు పోగొట్టేసింది. సల్మాన్ ఖాన్ లాంటి బడా హీరోలు రంజాన్ పండగ లాంటి ఛాన్స్ ని వాడుకోలేక చేతులు ఎత్తేస్తే అసలే ఇమేజ్ లేని అదా శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన నిజ జీవిత కథకి నార్త్ ఆడియన్స్ జై కొట్టేశారు.

తమిళనాడు, బెంగాల్, కేరళలో బ్యాన్ చేసినప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు రావడం నిజంగా అద్భుతమే. దర్శకుడు సుదిప్తో సేన్ పేరు మారుమ్రోగిపోతోంది. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కొంత ఆలస్యంగా వచ్చినందు వల్ల స్పందన ఆశించిన స్థాయిలో లేదు. మండిపోయే ఎండల్లోనూ కంటెంట్ బలాన్ని 2018, ది కేరళ స్టోరీ ఋజువు చేశాయి.

ఓపెనింగ్స్ తెచ్చే స్టార్లు లేకపోయినా కేవలం టాక్ తో రికార్డులు బద్దలు కొట్టొచ్చని పాఠం నేర్పించాయి. దురదృష్టవశాత్తు అలాంటి మేజిక్ మూవీ ఏదీ తెలుగులో పడలేదు. దసరా, విరూపాక్ష మినహాయించి సీజన్ మొత్తం డల్లుగా నడిచిపోయింది. ఏజెంట్, శాకుంతలం, కస్టడీలు తెచ్చిన నీరసం అంతా ఇంతా కాదు. సమ్మర్ ఇంకో రెండు నెలలు కొనసాగుతుంది కాబట్టి ఆలోగా కనీసం ఓ మూడు నాలుగు బ్లాక్ బస్టర్లు పడితే థియేటర్లకు మళ్ళీ కళ వస్తుంది. లేదంటే ఈ సెలవులు వృథా అయినట్టే.