నైజామ్ వసూళ్లకు టికెట్ రేట్ల దెబ్బ

కొద్దిరోజుల క్రితం దర్శకుడు తేజ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ థియేటర్ సినిమాను పాప్ కార్న్ రేట్లు చంపేస్తున్నాయని అన్నారు. నిజమే. కానీ అసలైన టికెట్ ధరల విషయంలో అమలవుతున్న అసంబద్ధ విధానం గురించి కూడా నాలుగు ముక్కలు చెప్పి ఉంటే బాగుండేదని నెటిజెన్లు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఈ మధ్య ఏదైనా కొత్త సినిమా వస్తే చాలు మల్టీప్లెక్సులు జిఓ ప్రకారం తమకు అనుమతించిన 295 రూపాయల గరిష్ట ధరను గుడ్డిగా పెట్టేస్తున్నారు. దీని వల్ల ముందుగా టికెట్లు రిజర్వ్ చేసుకోవాలనుకున్న వాళ్లకు అదనంగా మరో 30 రూపాయలు చమురు వదులుతోంది.

ఈ కారణంగానే కస్టడీకి ఆశించిన స్థాయిలో ఫస్ట్ డే బుకింగ్స్ కనిపించలేదు. సింగల్ స్క్రీన్లలో కౌంటర్ అమ్మకాలు ఎక్కువ జరుగుతాయి కానీ మల్టీప్లెక్సులకు వచ్చే వాళ్ళు అధిక శాతం ఆధారపడేది ఆన్ లైన్ యాప్స్ మీదే. అలాంటప్పుడు పబ్లిక్ టాక్ రివ్యూలు చూసి వెళ్దామని వెయిట్ చేస్తున్నారు. ఏజెంట్, శాకుంతలం ఫలితాలను పక్కనపెడితే ఈ రేట్లే ఫస్ట్ డే మార్నింగ్ షో అయ్యాక మిగిలిన ఆటల కలెక్షన్ ని దెబ్బ కొట్టాయి. ఇది ఏడాదిగా రిపీట్ అవుతూనే ఉంది. గతంలో విక్రమ్, మేజర్ లాంటి వాటికి 200 రూపాయలు నిర్ణయించడం అవి బ్లాక్ బస్టరయ్యాక చాలా ఉపయోగపడింది

ట్రాజెడీ ఏంటంటే ఫలితం తెలిసిపోయాక కూడా రెండో వారంలోనూ అదే 295 కంటిన్యూ చేయడం డిజాస్టర్లకు శరాఘాతంగా మారుతోంది. ఇక్కడ ఎగ్జిబిటర్ కన్నా ఎక్కువగా డిస్ట్రిబ్యూటర్ నిర్మాత నష్టపోతారు. దాని బదులు ముందే సరైన నిర్ణయం తీసుకుంటే ఈ ఇబ్బంది ఉండదు. ఏపీలో ఈ సమస్య లేకపోవడం అక్కడి మూవీ లవర్స్ కి పెద్ద ఊరట. ప్రత్యేకమైన పరిస్థితులు బడ్జెట్ లు ఉన్న వాటికి ముందే అనుమతి తీసుకుంటే తప్ప రేట్లు పెంచుకోలేరు. సంక్రాంతి తర్వాత ఎవరూ అప్లై చేసుకోలేదు. ఇకనైనా నైజామ్ లో ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడం అవసరం