లోబజ్‌తో 22 కోట్లు కొట్టాలి

అక్కినేని నాగచైతన్య మరోసారి బాక్సాఫీస్ పరీక్షకు సిద్ధమయ్యాడు. ‘మజిలీ’ తర్వాత చైతూకు సరైన విజయం లేని సంగతి తెలిసిందే. అతడి చివరి సినిమా ‘థాంక్యూ’ బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొంది. విక్రమ్ కుమార్ లాంటి స్టార్ డైరెక్టర్, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత కలిసి చేసిన ఈ సినిమా కనీసం నాలుగు కోట్ల షేర్ కూడా రాబట్టలేక డిజాస్టర్ అయింది. మామూలుగా చైతూకు క్లాస్ సినిమాలు బాగానే కలిసొస్తుంటాయి. కానీ ఈ సినిమా అతడి శైలిలోనే సాగినా.. ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఈసారి అతను కొంచెం మాస్ టచ్ ఉన్న.. థ్రిల్లర్ కథతో బాక్సాఫీస్ వేటకు రెడీ అయ్యాడు. తమిళంలో విలక్షణ కథలతోనే కమర్షియల్‌గా మంచి విజయాలు అందుకున్న వెంకట్ ప్రభు.. చైతూ తీసిన ‘కస్టడీ’ ఈ శుక్రవారమే తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ రెండూ కూడా ఆకట్టుకున్నాయి. ఒక ఉత్కంఠభరిత ట్రైలర్ చూడబోతున్న సంకేతాలు ఇచ్చాయి.

కానీ ప్రస్తుతం బాక్సాఫీస్ పరిస్థితి ఏమంత బాగా లేకపోవడం, చైతూ గత సినిమాల ప్రభావం వల్ల ‘కస్టడీ’ అనుకున్నంత బజ్ అయితే లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కొంచెం డల్లుగానే నడుస్తున్నాయి. తమిళంలో పూర్తిగా వెంకట్ ప్రభు ఇమేజ్ మీదే ఈ సినిమా ఫలితం ఆధారపడబోతోంది. తెలుగు వరకు ఈ సినిమా రూ.22 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ చేసింది. నైజాం ఏరియాకు రూ.8 కోట్లు, ఆంధ్రా-రాయలసీమ కలిపి రూ.12 కోట్లకు హక్కులు అమ్మినట్లు సమాచారం.

మామూలుగా చూస్తే ఇది మరీ పెద్ద టార్గెట్ కాదు కానీ.. ప్రస్తుత బాక్సాఫీస్ పరిస్థితులు, చైతూ ట్రాక్ రికార్డు దృష్ట్యా ఇది కొంచెం పెద్ద టార్గెట్టే. ఈ సినిమాకు మరీ ఎక్కువ ఓపెనింగ్స్ ఆశించే పరిస్థితి లేదు. మొత్తం టాక్ మీదే ఆధారపడి ఉంది. రూ.22 కోట్ల షేర్ రావాలంటే టాక్ చాలా బాగుండాలి. గత నెలలో ‘విరూపాక్ష’ సినిమా తక్కువ బజ్‌తోనే రిలీజై.. పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లింది. అలాంటి మ్యాజిక్కే ‘కస్టడీ’కి కూడా జరగాల్సి ఉంది.