మహేష్ అభిమానులకు నిర్మాత అభయం

ఏ ముహూర్తాన మహేష్ బాబు-త్రివిక్రమ్ కొత్త సినిమాను ప్రకటించారో కానీ.. మొదట్నుంచి ఈ సినిమాకు ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. నిజానికి ఈ సినిమా ప్రకటనే విచిత్రమైన పరిస్థితుల మధ్య వచ్చింది. ‘అల వైకుంఠపురములో’ తర్వాత ఎన్టీఆర్‌తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్.. కొన్ని కారణాల వల్ల దాన్ని క్యాన్సిల్ చేసి మహేష్ మూవీని అనౌన్స్ చేయించాడు. ఆపై ఈ సినిమా స్క్రిప్టు విషయంలో తర్జన భర్జనలు నడిచాయి.


ముందు ఒక యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీని ఓకే చేసి షూటింగ్‌కు వెళ్లారు. కానీ తర్వాత ఔట్ పుట్ చూసి వెనక్కి తగ్గారు. తమ కలయికలో ప్రేక్షకులు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆశిస్తారని.. ఇలాంటి యాక్షన్ మూవీ తమ కాంబోలో సెట్ కాదని మహేష్, త్రివిక్రమ్ మనసు మార్చుకున్నారు. కొంచెం గ్యాప్ తీసుకుని కొత్త కథతో ప్రయాణం మొదలుపెట్టారు. మహేష్ కొన్ని నెలల వ్యవధిలో తన తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది.

అన్ని అవాంతరాలను దాటుకుని కొన్ని నెలల కిందటే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారు. షూటింగ్ కూడా సాఫీగా సాగింది. కానీ ఇంతలో మహేష్-త్రివిక్రమ్ సినిమా గురించి కొత్త రూమర్లు మొదలయ్యాయి. ఇప్పటికే చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలు, అలాగే ఒక యాక్షన్ ఎపిసోడ్ విషయంలో అసంతృప్తి చెందడం వల్ల వాటిని పక్కన పెడుతున్నట్లుగా ప్రచారం మొదలైంది. దీని గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తోడు మీడియాలోనూ వార్తలు రావడంతో నిర్మాత నాగవంశీ స్పందించాడు. ఈ ప్రచారాన్ని ఆయన ఖండించాడు.

అటెన్షన్ కోసమే ఇలాంటి వార్తలు పుట్టిస్తారని.. వీటిని చూసి నవ్వుకోవడం తప్ప చేసేదేమీ లేదని ఆయన సెటైర్ వేశారు. అంతే కాక మహేష్ అభిమానులు ఇలాంటివి పట్టించుకోకుండా తాను చెప్పే మాటను మాత్రమే గుర్తుంచుకోవాలని పేర్కొంటూ.. మహేష్ 28 అభిమానులకు అమితమైన ఆనందాన్నివ్వడంతో పాటు వారి మనసుల్లో ఎప్పటికి నిలిచిపోతుందని స్పష్టం చేశాడు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు.