పవన్ అభిమానిని చంపేసిన ప్రభాస్ ఫ్యాన్

అభిమానం ఉండాలే కానీ దురభిమానం అస్సలు ఉండకూడదు. ఈ చిన్న విషయాన్ని మర్చిపోయిన ఇద్దరు స్నేహితుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ.. చివరకు ఒకరి ప్రాణం పోయేలా చేసింది. గతానికి భిన్నంగా సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య స్నేహం ఒక స్థాయికి మించి ఉన్న వేళ.. అందుకు భిన్నంగా హీరోలను అమితంగా అభిమానించే వారి మధ్య ఘర్షణలో అర్థం లేదు. ఈ విషయాన్ని వదిలేసి.. తాము అభిమానించే హీరో గొప్ప అంటే తాను అభిమానించే హీరో తోపు అనుకునే అనవసరమైన వాదనతో ఏర్పడిన ఘర్షణకు ఒక నిండు ప్రాణం బలైంది. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ దారుణ ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదు. ఇదెక్కడి దరిద్రపుగొట్టు అభిమానం అనుకోకుండా ఉండలేం.

తణుకు పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తిలి మసీదు వీధిలో ఒక బిల్డింగ్ కు రంగులు వేయటానికి ఏలూరు నుంచి హరి, కిషోర్ లు వచ్చారు. ఉదయం పని చేసి.. రాత్రిళ్లు తాము పని చేసే బిల్డింగ్ పైన పడుకుంటూ ఉంటారు. వీరిద్దరు స్నేహితులు కావటంతో వారి మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ వస్తూ ఉంటుంది. హరికుమార్ ఏలూరులో ప్రభాస్ అభిమాన సంఘానికి కార్యదర్శిగా వ్యవహరిస్తుంటాడు. ఒక..కిశోర్ పవన్ కల్యాణ్ కు అభిమాని.

శుక్రవారం రాత్రి బిల్డింగ్ పైన పడుకున్న వేళ.. ఈ ఇద్దరు స్నేహితుల మధ్య హీరోల మీద చర్చ మొదలైంది. హరి తన వాట్సాప్ స్టేటస్ లో ప్రభాస్ వీడియోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. దీనికి కిషోర్ ప్రభాస్ వద్దు.. పవన్ కల్యాణ్ వీడియోలను స్టేటస్ గా పెట్టుకోవాలని సూచన చేశాడు. ఇద్దరు మద్యం మత్తులో ఉన్న వేళ.. ఈ విషయం మీద అదే పనిగా మాట్లాడుకోవటం.. చర్చ పక్క దారి పట్టింది. మద్యం మత్తులో ఉన్న కిశోర్ ప్రభాస్ ను తిట్టేశాడు.

దీంతో విపరీతమైన కోపానికి గురైన హరికుమార్.. అక్కడే ఉన్న సెంట్రింగ్ కర్రతో కిశోర్ తల మీద బలంగా కొట్టేయటమే కాదు.. అక్కడే ఉన్న సిమెంట్ రాయితో మొహం మీద బలంగా అదమటంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ దారుణ ఉదంతం గురించి తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హరికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అభిమానుల మీద అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి చేష్టలు ఏ మాత్రం సరికావన్న నిజాన్ని ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది.