మారుతికి కలిసొచ్చిన ప్రభాస్ లీక్

కొన్ని కాంబినేషన్లు ప్రకటించిన టైంలో కొంత నెగటివిటీని మూటగట్టుకుంటాయి. వాటిని తగ్గించడానికి దర్శక నిర్మాతలు నానా పాట్లు పడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అనుకోకుండా జరిగే పరిణామాలు కలిసొస్తాయి. ప్రభాస్ మారుతీ కలయికలో రూపొందుతున్న ప్యాన్ ఇండియా మూవీకి అలాగే జరుగుతోంది. అనౌన్స్ చేసినప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంత కాలంగా సక్సెస్ లేని డైరెక్టర్ తో తమ హీరో చేయడమేంటని రుసరుసలాడారు. దానికి తగ్గట్టే మారుతీ గత చిత్రాలు పక్కా కమర్షియల్, మంచి రోజులు వచ్చాయి కనీస స్థాయిలో ఆడలేక ఫ్లాపయ్యాయి.

అందుకే ఈ కాంబో మీద అన్ని కామెంట్స్ వచ్చాయి. అయినా అదేమీ పట్టించుకోకుండా షూటింగ్ మొదలుపెట్టేశారు. ఆది పురుష్, సలార్ విడుదల ఈ ఏడాదే ఉన్న నేపథ్యంలో తమ చిత్రం తాలూకు అప్డేట్స్ బయటికి రాకుండా మారుతీ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకొంటోంది. అయినా కూడా పాట చిత్రీకరణ జరుగుతున్న టైంలో ప్రభాస్ తాలూకు లుక్ ఒకటి బయటికి లీకైపోయింది. అందులో అమ్మాయి కూడా ఉండి సరైన క్లారిటీ లేకపోయినా రిద్ది కుమారేనని మూవీ లవర్స్ గుర్తుపట్టేశారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లు గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడీ లీక్డ్ పిక్కే మారుతీకి ప్లస్ అవుతోంది. ప్రభాస్ చాలా స్టయిలిష్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఆది పురుష్ లో గ్రాఫిక్ మిక్స్, సలార్ లో మొహమంతా మసిపూసిన మాస్ కలర్ లతో పోల్చుకుని చూస్తే ఈ ఫోటోలో ఒకప్పటి డార్లింగ్, మిర్చి ప్రభాస్ గుర్తొస్తున్నాడని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అపార్థం చేసుకున్నామంటూ ప్రత్యేకంగా థాంక్స్ చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు. రాజా డీలక్స్ తో పాటు మరో రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్న కామెడీ కం హారర్ యాక్షన్ థ్రిల్లర్ ని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు. ప్రాజెక్ట్ కె వాయిదా పడితే ఇది సంక్రాంతికి రావొచ్చు.