సాంగ్స్ బజ్ పొగోడుతున్నాయ్


ఒకప్పుడు కేవలం పాటల వల్లే బ్లాక్‌బస్టర్లు అయిన సినిమాలున్నాయి. అల్లరి ప్రియుడు, పెళ్ళిసందడి సహా చాలా సినిమాలను ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాల్లో పాటలకు ప్రాధాన్యం తగ్గి ఉండొచ్చు కానీ.. అవి అవసరం లేదు అని మాత్రం ఎప్పుడూ కొట్టి పారేయలేం. కథే ప్రధానంగా.. థ్రిల్లర్ టచ్ ఉన్న సినిమాలు తీసే సుకుమార్ సైతం పాటల మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. పాటలతోనే తన సినిమాలకు మంచి బజ్ వచ్చేలా చూసుకుంటారు.

‘పుష్ఫ’ సినిమా అంత పెద్ద సక్సెస్ కావడంలో పాటల పాత్ర ఎంతో కీలకం. ఈ రోజుల్లో సినిమాలకు సగం ప్రమోషన్ పాటల ద్వారానే జరుగుతోంది. సోషల్ మీడియాలో బజ్ పెంచడంలో పాటలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ విషయం అర్థం చేసుకోకపోవడం వల్లో, పాటల మీద శ్రద్ధ పెట్టకపోవడం వల్లో కొన్ని సినిమాలకు బజ్ క్రియేట్ కావట్లేదు.

రవితేజ నుంచి చివరగా వచ్చిన ‘ధమాకా’ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడంలో పాటలు ముఖ్య పాత్ర పోషించాయి. ఆ సినిమా పాటలు సోషల్ మీడియాను ఊపేశాయి. తెర మీద కూడా పాటలు బాగా వచ్చాయి. కానీ ఆయన కొత్త చిత్రం ‘రావణాసుర’ దీనికి పూర్తి భిన్నం. అందులో ఒక్క పాట కూడా క్లిక్ కాలేదు. దీంతో రిలీజ్ ముంగిట సినిమాకు బజ్ క్రియేటవ్వలేదు. సరైన ఓపెనింగ్స్ కూడా రాలేదీ చిత్రానికి. ‘ధమాకా’ కూడా కంటెంట్ పరంగా వీక్ అయినా భారీ వసూళ్లు సాధించింది. కానీ ‘రావణాసుర’ చతికిల పడింది. ఇక్కడే తేడా అర్థమైపోతుంది.

ఇక నెలాఖర్లో రిలీజ్ కాబోతున్న ‘ఏజెంట్’ సినిమాకు అనుకున్న స్థాయిలో బజ్ రాలేదు. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన రెండు పాటల్లో ఒక్కటీ జనాలకు ఎక్కలేదు. ఇలాంటి మాస్-యాక్షన్ సినిమాలో మంచి ఊపున్న పాటలు పడి.. అవి సోషల్ మీడియాలో పాపులర్ అయి ఉంటే బజ్ ఆటోమేటిగ్గా వచ్చేసేది. ఈ శుక్రవారం విడుదల కానున్న సమంత సినిమా ‘శాకుంతలం’కి కూడా పాటలు మైనస్ అయ్యాయి. ఒక్క పాటా పాపులర్ కాలేదు. సోషల్ మీడియాలో వైరల్ కాలేదు. నాగచైతన్య సినిమా ‘కస్టడీ’ నుంచి రిలీజ్ చేస్తున్న పాటల పరిస్థితీ అంతంతమాత్రంగానే ఉంది. ఈ ట్రెండు చూశాక అయినా.. రాబోయే సినిమాల విషయంలో పాటలు బాగుండేలా, సోషల్ మీడియాను ఊపేసేలా ఉండేలా చూసుకుంటే బెటర్.