బన్నీకి ఎలివేషన్.. మిగతా స్టార్లపై ఫ్రస్టేషన్


హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ఏదైనా పాత్ర చేయమంటే కాస్త ఇమేజ్ ఉన్న హీరోలెవరూ అంగీకరించరు. తమను డమ్మీని చేసేస్తారేమో అని, స్థాయి తగ్గిపోతుందేమో అని ఫీలవుతుంటారు. కానీ కొద్దిమంది హీరోలు మాత్రమే ఇలాంటి భేషజాలేమీ పెట్టుకోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తుంటారు. ‘రుద్రమదేవి’ సినిమాలో రానా దగ్గుబాటి ఆమెకు జోడీగా కనిపించి మెప్పిస్తే.. అందులో అల్లు అర్జున్ ప్రత్యేక పాత్రతో మెరిశాడు. కానీ ఈ చిత్ర దర్శకుడు గుణశేఖర్ తీసిన తర్వాతి సినిమా ‘శాకుంతలం’కి మాత్రం అలా స్టార్ల బలం తోడవలేదు.

ఇందులో సమంతకు జోడీగా దుష్యంతుడి పాత్ర కోసం తెలుగు స్టార్లు కొందరిని సంప్రదించాడట గుణశేఖర్. కానీ ఎవ్వరూ ఒప్పుకోకపోవడంతో మలయాళ నటుడు దేవ్ మోహన్‌తో ఆ పాత్ర చేయించాడు. ఇటీవల ‘శాకుంతలం’ ప్రిమియర్ చూసిన చాలామంది ఎవరైనా స్టార్ హీరో దుష్యంతుడి పాత్రలో నటించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. మీడియా వాళ్లు కూడా ఇదే విషయమై గుణశేఖర్‌ను ప్రశ్నిస్తే.. ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

“రుద్రమదేవి సినిమాను మొదలు పెట్టినపుడు అందులో అల్లు అర్జున్ లేడు. మధ్యలో వచ్చి ఆ సినిమాలో చేరాడు. గోన గన్నారెడ్డి పాత్ర గురించి చెప్పగానే ఒక్క మాట ఆలోచించకుండా ఆ క్యారెక్టర్ చేశాడు. ఆ పాత్ర అంత బాగా పండింది. సినిమాకు ఉపయోగపడింది. హీరోలు ఇమేజ్ గురించి ఆలోచించకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలి. దుష్యంతుడి పాత్ర కోసం తెలుగులో కొందరు స్టార్ హీరోలను అడిగాం. కానీ ఎవ్వరూ చేయకపోవడంతోనే దేవ్ మోహన్‌ను తీసుకున్నాం. అతను ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశాడు” అని గుణశేఖర్ తెలిపాడు. ‘శాకుంతలం’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.