మంచి పనిని ఆలస్యంగా చేశారు

ఆస్కార్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఎంత గౌరవముందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఒక తెలుగు సినిమా పాటకు వచ్చినప్పుడు అదో అంబరాన్ని తాకే సంబరమే అవ్వాలి. కానీ ఆర్ఆర్ఆర్ టీమ్ పురస్కారాన్ని అందుకుని దేశానికి తిరిగి వచ్చాక అలాంటిదేమి కనిపించలేదు. పార్లమెంట్ లో సన్మానం చేస్తామని కొందరు ఎంపీలు ప్రకటించారు. దాని ఊసు లేదు. చంద్రబోస్, ఎంఎం కీరవాణిలను వ్యక్తిగతంగా కలుసుకోవడం లేదా పిలిపించుకోవడం ద్వారా పలువురు టాలీవుడ్ ప్రముఖులు వాళ్లను సత్కరించారు తప్ప అందరూ కలిసి నడుం బిగించింది ఏదీ లేదు.

సరే ఆలస్యమైతే అయ్యింది లెమ్మని నిన్న హైదరాబాద్ శిల్పా కళావేదికపై అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అది కూడా ఆస్కార్ వచ్చిన ఇరవై ఎనిమిది రోజుల తర్వాత. తెలంగాణ ప్రభుత్వం తరఫున తలసాని శ్రీనివాస యాదవ్, శ్రీనివాస్ గౌడ్, అనిల్ తదితరులు ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఇండస్ట్రీకి సంబందించిన పెద్దలు ప్రముఖులు కనిపించారు. అయితే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు లేకపోవడం కొంత లోటుగానే అనిపించింది. సరే అక్కడ హైలైట్ అవ్వాల్సింది సంగీత దర్శకుడు, గీత రచయిత కాబట్టి హీరోలు లేకపోవడమే మంచిదనే లాజిక్ కరెక్టే.

నిజానికీ ఘనత భాషలతో సంబంధం లేకుండా దేశం మొత్తం వర్తిస్తుంది. కానీ బాలీవుడ్ మాకేం సంబంధం లేదన్న రీతిలో ఖాన్లతో సహా ఎవరికీ కనీసం ట్వీట్ చేసి కంగ్రాట్స్ చెప్పడానికి కూడా మనసు రాలేదు. నాటు నాటు విజయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి. సరే లేట్ అయితే అయ్యింది ఇప్పుడైనా చేశారు కదాని సంతోషపడటం తప్ప ఎవరైనా చేయగలిగింది ఏముంది. ఒకప్పుడు నంది అవార్డు వస్తేనే అదేదో ప్రపంచాన్ని జయించినంత గొప్పగా ఉండేది. అంతకు మించి ఇప్పుడు ఆస్కార్ వచ్చినా ఎందుకో ఆనందం కుదించుకుపోతోంది.