కలల సినిమా ఎట్టకేలకు పట్టాలెక్కింది

ఎప్పుడో 2019 సెప్టెంబరులో విడుదలైంది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ చివరి సినిమా ‘గద్దలకొండ గణేష్’. ఆ సినిమా మంచి హిట్ అయినా సరే.. ఇప్పటిదాకా హరీష్ శంకర్ తన కొత్త చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లలేకపోయాడు. అలా అని ఆయనకు క్రేజ్ లేదా, అవకాశాలు లేవా అంటే అదేం కాదు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణే తనతో కొత్త సినిమా చేయడానికి ఓకే చెప్పాడు. కానీ రకరకాల కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగింది.

పవన్‌కు ఉన్న వేరే సినిమా కమిట్మెంట్లు, రాజకీయ కార్యకలాపాల వల్ల ఈ సినిమాను అనుకున్న సమయానికి మొదలుపెట్టలేకపోయాడు. ఒక దశలో హరీష్ ఈ సినిమా మీద ఆశలు వదులుకుని, వేరే ప్రాజెక్టు వైపు చూస్తున్నట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారానికి తెరదించే కొన్ని నెలల కిందటే పవన్-హరీష్ సినిమాకు ముహూర్త వేడుక జరిపారు.

ఆ తర్వాత షూటింగ్ కోసం మళ్లీ నిరీక్షణ తప్పలేదు. ఐతే ఎట్లకేలకు ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. మూడున్నరేళ్లకు పైగా ఎదురు చూపుల తర్వాత బుధవారమే తిరిగి మెగా ఫోన్ పట్టాడు హరీష్. ఈ సినిమా షూట్ మొదలైన సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హ్యాష్ ట్యాగ్ పెట్టి ‘ఎన్నాళ్లో వేచిన ఉదయం’ పాట తాలూకు వీడియోను షేర్ చేశాడు హరీష్. ఈ చిత్రం కోసం ఎట్టకేలకు పవన్ డేట్స్ ఇచ్చాడు. భారీ సెట్ తీర్చిదిద్దుకుని హరీష్ అండ్ కో రంగంలోకి దిగింది. కొన్ని రోజుల పాటు విరామం లేకుండా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు పవన్. ఆ తర్వాత సుజీత్ సినిమాను కూడా పవన్ మొదలుపెడతానే సంకేతాలు వస్తున్నాయి.

తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’ ఆధారంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరకెక్కుతున్నప్పటికీ.. కథలో మార్పులు చేర్పులు చాలానే జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ దశరథ్ రచయితగా పని చేయడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల ఒక కథానాయికగా నటించొచ్చనే ప్రచారం జరుగుతోంది.