ప్రేమికుడితో జాన్వీ కపూర్ చెట్టాపట్టాలు

అతిలోకసుందరి దివంగత శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ నెంబర్ పరంగా చెప్పుకోదగ్గ సినిమాలైతే చేసింది కానీ చరిత్ర తిరగరాసిన బ్లాక్ బస్టర్స్ ఇంకా పడలేదు. టాలీవుడ్ కు పరిచయం చేసేందుకు ఏళ్ళ తరబడి జరిగిన ప్రయత్నాలు ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ 30తో ఫలించిన సంగతి తెలిసిందే. అయితే కెరీర్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టైంలో జాన్వీ తన నిజ జీవిత ప్రేమికుడితో చెట్టపట్టాలు వేసుకుని తిరగడం, ఆ ఫోటోలు వీడియోలు బయటికి రావడం వైరల్ అవుతున్నాయి. అతని పేరు శిఖర్ పహారియా.

తాజాగా తిరుపతిలో జాన్వీతో కలిసి ఏడుకొండలవాడి దర్శనం చేసుకుని కెమెరా కంటికి చిక్కాడు. వీళ్ళతో పాటు శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కూడా ఉండటం గమనార్హం. శిఖర్ ఈ కుటుంబంతో చనువుగా ఉండటం ఇదేం కొత్త కాదు. ఇటీవలే అంబానీ కుటుంబం నెలకొల్పిన ఎన్ఎంఏసిసి లాంచ్ ఈవెంట్ లో బోనీ కపూర్ తో కలిసి ఫోజులు ఇచ్చాడు. లోపల జాన్వీతో ఉన్న పిక్స్ కూడా వచ్చాయి. ఈ కుర్రాడి బ్యాక్ గ్రౌండ్ చిన్నదేమీ కాదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే ముద్దుల మనవడు. మధ్యలో జాన్వీతో బ్రేకప్ చేసుకున్నాడు కానీ తిరిగి డిసెంబర్ లో ప్యాచ్ అయ్యింది.

ఈ మధ్య బాలీవుడ్ హీరోయిన్లు పెళ్ళయాక కూడా కెరీర్ కు ఢోకా ఉండదని అర్థం చేసుకుని తమ బంధాన్ని బయట పెట్టుకోవడానికి మొహమాటపడటం లేదు. దీపికా పదుకునే, అనుష్క శర్మ, కియారా అద్వానీ లాంటి యంగ్ జెనరేషన్ భామలందరూ మూడు ముళ్ళు వేయించుకున్నాక ప్రాజెక్టులు ఓకే చేస్తున్నారు. జాన్వీ కపూర్ సైతం శిఖర్ తో త్వరలోనే ఏడడుగులు నడవడం ఖాయమని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. శిఖర్ ఓ లండన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనలిస్ట్ గా పని చేశాడు. సోదరుడు వీర్ తో కలిసి 2018లో గేమింగ్ సంస్థను నెలకొల్పాడు. చేయి తిరిగిన పోలో ఆటగాడు. ఎన్జిఓలతో కలిసి పని చేసిన అనుభవముంది.