బలగం ఉచిత షోలపై పోలీస్ కంప్లయింట్

తెలంగాణ వ్యాప్తంగా ఏదో సంబరంలా జరుగుతున్న బలగం ఓపెన్ ఫ్రీ షోలు పెద్ద రాద్ధాంతానికే దారి తీసేలా ఉన్నాయి. ముందు ఒకటి రెండు గ్రామాల్లో మొదలైన ఈ ట్రెండ్ మెల్లగా వందల సంఖ్యలో పల్లెటూళ్ళకు పాకిపోవడంతో ఉచితంగా చూసిన వాళ్ళ సంఖ్య లక్షలకు చేరినా ఆశ్చర్యం లేదనేలా ఉంది. సోషల్ మీడియాలో ఈ స్క్రీనింగ్స్ తాలూకు ఫోటోలు వీడియోలు వైరలవుతున్నాయి. దీంతో థియేటర్ రెవిన్యూకు గండి పడుతోందని గుర్తించిన నిర్మాత దిల్ రాజు తన నిర్మాణ సంస్థ తరఫున నిజామాబాద్ ఎస్పికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఆ లేఖలో కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు అమెజాన్ ప్రైమ్ నుంచి చట్టవ్యతిరేకంగా సినిమాను డౌన్లోడ్ చేసుకుని ఉచితంగా పబ్లిక్ కి పంచి పెడుతున్నాయని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని అందులో పేర్కొన్నారు. నిజానికి ఎగ్జిబిషన్ యాక్ట్ ప్రకారం నిర్మాత అనుమతి లేకుండా వందల జనాన్ని పోగేసి అలా ఆరుబయట సినిమా వేయడం ఇల్లీగలే. అయితే జనంలో బలగం పట్ల విపరీతమైన ఆసక్తిని గమనించిన సర్పంచులు రాజకీయ నాయకులు వాళ్ళను సంతోష పెట్టడం కోసం షోలు వేయడం ఇంత రభసకు కారణమయ్యింది. ప్రైమ్ కు తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది.

అసలు రిలీజై విజయవంతంగా బ్లాక్ బస్టర్ అయిన సినిమాను కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో ఓటిటికి ఇచ్చినప్పుడు ఇలాంటి పరిణామాలే జరుగుతాయి. అదే ఏ నెలన్నరో రెండు నెలలో అయ్యుంటే ఈ స్థాయిలో ఫ్రీ షోలు పడేవి కాదన్నది వాస్తవం. ఒకరకంగా ఇక్కడ ప్రొడ్యూసర్ వల్లే ఈ పరిణామం తలెత్తింది. అలా అని వేసినవాళ్లది ఏ తప్పూ లేదని కాదు. అత్యుత్సాహంలో ఇలా చేయడం కరెక్టా కాదానేది ఎవరిని అడగకుండా పని కానిచ్చేశారు. తీరా చూస్తే వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది. ఇదంతా ఎలా ఉన్నా బలగం చూశాక తెలంగాణలో కొన్ని విడిపోయిన కుటుంబాలు కలవడం కొసమెరుపు.