మంచి సినిమా మెల్లగా ఎక్కుతోంది

పఠాన్ తరువాత వేరే ఆప్షన్ లేక దాంతోనే నెట్టుకొస్తున్న బాలీవుడ్ కు ఆ మధ్య కొత్త రిలీజులెవీ ఉత్సాహాన్ని కలిగించలేదు. షెహజాదా, సెల్ఫీలు ఫ్లాప్ కాగా తూ ఝూటి మై మక్కర్ క్రమంగా గట్టెక్కుతోంది. నిన్న కొత్త సినిమాలు రిలీజైన విషయం జనాలకు పెద్దగా తెలియకుండానే థియేటర్లలో అడుగు పెట్టాయి. వాటిలో అంతో ఇంతో బజ్ ఉన్నది మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే ఒకటే. చాలా కాలంగా నటనకు దూరంగా ఉన్న రాణి ముఖర్జీ మర్దానీ 2 తర్వాత చేసిన మూవీ ఇదే. గుట్టుచప్పుడు కాకుండా సైలెంట్ గా ఇండియా వైడ్ కేవలం 500 స్క్రీన్లలో మాత్రమే విడుదల చేశారు.

మొదటిరోజు కోటిన్నర మాత్రమే వసూళ్లు వచ్చినా టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది. కారణం కంటెంట్ మీద పాజిటివ్ టాక్ రావడమే. ఇది రియల్ లైఫ్ స్టోరీ. 2012లో సాగరిక అనే భారతీయురాలి పిల్లలను నార్వే ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. దాంతో విదేశీ గవర్నమెంట్ తో పోరాటం మొదలుపెట్టిన ఆ తల్లి ఏకంగా రెండు దేశాల మధ్య సంబంధాల మీదే ప్రభావం చూపిస్తుంది. అసలు మాటలే సరిగా రాని పసిగుడ్లకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, తండ్రి ఏమయ్యాడు లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. మంచి డ్రామా జొప్పించారు.

టాక్ తో పాటు రివ్యూలు పాజిటివ్ గా రావడంతో మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్ పెరుగుతున్నారు. మల్టీప్లెక్సుల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా దర్శకురాలు ఆషిమా చిబ్బర్ తీసిన ఈ ఎమోషనల్ మూవీలో మెలోడ్రామా కాస్త అధికంగానే ఉన్నప్పటికీ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ వల్ల మరీ బోర్ కొట్టకుండా నీట్ గా సాగింది. నిజ జీవిత కథ ఆధారంగా తీయడం వల్ల కమర్షియల్ ఎలిమెంట్స్ కి చోటు దక్కలేదు. ఒకపక్క కబ్జతో పాటు కపిల్ శర్మ హీరోగా డెబ్యూ చేసిన జ్విగాటోకు పెద్దగా స్పందన రాలేదు. సో మిసెస్ ఛటర్జీ కనక బలంగా నిలబడితే హిట్టు పడినట్టే.