ఆస్కార్ ఇచ్చారు.. కానీ అవమానించారు

ఈసారి ఆస్కార్ అవార్డుల్లో ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాట మాత్రమే కాదు.. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ అనే ఇండియన్ డాక్యుమెంటరీ కూడా పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన గునీత్ మోంగా ఆస్కార్ అవార్డుల నిర్వాహకులు తన పట్ల వ్యవహరించిన తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

ఆస్కార్ అవార్డు అందుకున్న అనంతరం తనకు అవమానం జరిగిందని ఆమె వెల్లడించారు. ఆస్కార్ అందుకున్న తర్వాత ప్రతి ఒక్కరికీ 45 సెకన్లు మాట్లాడే అవకాశం ఇస్తారు. ఒకవేళ ఎవరైనా అంతకుమించి సమయం మాట్లాడుతుంటే మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తారు. కానీ గునీత్ మోంగా తన ప్రసంగం మొదలుపెట్టగానే మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేశారట. దీంతో తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పకుండానే వెనుదిరగాల్సి వచ్చిందంటూ ఇండియాకు వచ్చాక విలేకరుల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

“ఆస్కార్ వేదిక మీద నేను మైక్ తీసుకుని మాట్లాడబోతుంటే మ్యూజిక్ ప్లే చేశారు. గొప్ప క్షణాలను నాకు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి లాక్కున్నట్లు అనిపించింది. నా తర్వాత బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ పురస్కారాలు అందుకున్న వారు 45 సెకన్లకు మించి మాట్లాడినా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. నాకు మాత్రం ఇలా ఎందుకు చేశారో అర్థం కాలేదు” అని గునీత్ మోంగా పేర్కొన్నారు.

గునీత్ మోంగా పేరు అంత పాపులర్ కాదు కానీ.. ఆమె గొప్ప గొప్ప సినిమాలే నిర్మించారు. గతంలో ఆస్కార్ అవార్డు కోసం ఇండియా తరఫున నామినేట్ అయిన ‘లంచ్ బాక్స్’తో పాటు ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్’, ‘మసాన్’, ‘జల్లికట్టు’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘విసారణై’ లాంటి గొప్ప చిత్రాలకు గునీత్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇలాంటి గొప్ప చిత్రాల్లో భాగస్వామిగా ఉన్న ఆమె.. ఇప్పుడు ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’తో ఆస్కార్ అవార్డునూ సొంతం చేసుకున్నారు.