మగధీర పక్కకు ఆరెంజ్ ముందుకు

రాను రాను చాలు బాబోయ్ అనిపించేలా రీ రిలీజుల ప్రహసనం కొనసాగుతూనే ఉంది. అయినా ఎవరికి వారు తగ్గేదేలే అంటూ పాతవన్నీ బయటికి తీసి బూజు దులుపుతున్నారు. బ్లాక్ బస్టర్స్ అంటే ఏదో అనుకోవచ్చు కానీ ఒరిజినల్ గా విడుదలైన టైంలో డిజాస్టర్స్ గా పేరు తెచ్చుకున్నవాటిని అదే పనిగా మళ్ళీ అభిమానుల కోసమంటూ ప్రచారం చేయడం విచిత్రం. ఈ నెల 27న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మగధీరని పునఃవిడుదల చేయబోతున్నట్టు రెండు వారాల క్రితం గీత ఆర్ట్స్ సంస్థ అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

కానీ ఇప్పుడీ ప్లాన్ లో మార్పు జరిగింది. మగధీర స్థానంలో ఆరంజ్ ని వేయబోతున్నారట. నిజానికి ఆర్ఆర్ఆర్ ఆస్కార్ తెచ్చిన సందర్భంలో రాజమౌళి ఎవర్ గ్రీన్ హిట్స్ ని వేయడం ఎంతైనా సముచితం. ఎలాగూ చరణ్ పుట్టినరోజు కలిసి వచ్చింది కాబట్టి మగధీర అన్ని రకాలుగా సెట్ అయ్యేది. ఈలోపు ఏం జరిగిందో కానీ జనసేన నిధుల సమీకరణ కోసం ఆరంజ్ వేయాలని ప్లాన్ చేస్తున్నట్టు కలర్ ఫోటో నిర్మాత, బేబీ దర్శకుడు సాయి రాజేష్ ట్విట్టర్ లో అనౌన్స్ చేశారు. గతంలో పవన్ కళ్యాణ్ జల్సాని భారీ ఎత్తున రిలీజ్ చేయడంలో కీలక పాత్ర పోషించింది ఈయనే.

ఇదంతా బాగానే ఉంది కానీ ఊరికే సోషల్ మీడియాలో పొగడటమే కానీ ఆరెంజ్ డిజాస్టర్ మూవీ. అప్పట్లో అంచనాలు అందుకోలేక బయ్యర్లకు తీవ్ర నష్టాలు తెచ్చింది. దీనివల్లే ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని నిర్మాత నాగబాబు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం సంచలనం అయ్యింది. హరీష్ జైరాజ్ పాటలు మాత్రమే ఛార్ట్ బస్టర్స్ అయ్యాయి. అలాంటి ఫ్లాప్ ని తీసుకురావడం వల్ల అంతగా ప్రయోజనం ఉంటుందానేదే సందేహం. మగధీర ప్రింట్ కు సంబంధించిన సాంకేతిక ఇబ్బందుల వల్లే హఠాత్తుగా ఆరెంజ్ ని దింపుతున్నారనే టాక్ కూడా ఉంది.