థియేటర్లే ముద్దు ఓటిటిలొదంటున్న ప్రొడ్యూసర్లు

తక్కువ బడ్జెట్ లో తీసిన సినిమాలను థియేటర్లలో వదిలితే లాభం మాట అటుంచి పెట్టుబడి వెనక్కు రావడమే గగనమైపోతున్న తరుణంలో చిన్న నిర్మాతల పాట్లని కళ్లారా చూస్తున్నాం. ఇటీవలే బలగం సాధించిన విజయం చూశాక అందరికీ ఉత్సాహం వచ్చినట్టు కనిపిస్తోంది. కేవలం కోటిన్నర బిజినెస్ చేసుకుని బరిలో దిగిన ఈ విలేజ్ డ్రామా పది రోజులు తిరక్కుండానే ఏడు కోట్ల గ్రాస్ ని సులభంగా దాటేయడం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. ఫక్తు తెలంగాణ నేటివిటీ బ్యాక్ డ్రాప్ కావడంతో ఏపి ఫిగర్లు కొంత తక్కువగా ఉన్నప్పటికీ దీని విజయాన్ని తక్కువ చేసి చూడలేం.

నిర్మాణం అయిపోతున్న టైంలో ఒక దశలో దిల్ రాజు దీన్ని డైరెక్ట్ ఓటిటికి ఇవ్వాలనే ఆలోచన చేసినట్టు ఇన్ సైడ్ టాక్. ఫైనల్ అవుట్ ఫుట్ చూశాక నిర్ణయం మార్చుకున్నారట. ఇప్పుడు ఇంటింటి రామాయణం నిర్మాతలు కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. కొన్ని వారాల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు త్వరలోనే ఆహా స్ట్రీమింగ్ ఉంటుందని చెప్పారు. కట్ చేస్తే కొంత కాలం సైలెంట్ అయ్యారు. ఇప్పుడు మనసు మార్చుకుని బిగ్ స్క్రీన్ మీద చూపిస్తామంటున్నారు. సితార నాగవంశీ, మారుతీ తదితరులు ఇందులో నిర్మాణ భాగస్వాములుగా వ్యవహరించారు.

ఇక్కడో విషయం మర్చిపోకూడదు. బలగం లాగే కంటెంట్ బలంగా ఉంటే తప్ప ఇలాంటి చిన్న సినిమాలు అంత సులభంగా బాక్సాఫీస్ ని నెగ్గుకురాలేవు. ప్రతిసారి నేటివిటీ సెంటిమెంట్ ని ప్రమోషన్ కు వాడుకున్నంత మాత్రాన పొలోమని వచ్చేయరు. బలగం మొదటి రోజు మార్నింగ్ షో, మ్యాట్నీలు చాలా డల్ గా మొదలైన సంగతిని మర్చిపోకూడదు. మౌత్ టాక్ విస్తృతమయ్యాకే ఆడియన్స్ పెరగడం స్టార్ట్ అయ్యింది. సో తొందరపడి ఈ ట్రెండ్ మీద ఎలాంటి అంచనాకు రాలేం. ఇంకో నాలుగైదు సినిమాలకు ఇదే స్పందన దక్కితే అప్పుడు హమ్మయ్య అనుకోవచ్చు. అంతదాకా ఎదురు చూడాల్సిందే.