కొత్త ప్లాన్‌తో రంగంలోకి విశ్వ‌క్సేన్


ఎలాంటి ఫిలిం బ్యాగ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి.. యూత్‌లో మంచి ఫాలోయింగే సంపాదించాడు విశ్వ‌క్సేన్. తొలి సినిమా వెళ్లిపోమాకేలో సైలెంట్‌గా ఉండే పాత్ర‌లో చూసి ఏమో అనుకున్నారు కానీ.. త‌ర్వాత అత‌ను అగ్రెసివ్ క్యారెక్ట‌ర్ల‌తో కుర్రాళ్ల‌లో కాక పుట్టించాడు. ఫ‌ల‌క్ నుమా దాస్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా కూడా మారిన అత‌ను.. ఇప్పుడు మ‌రోసారి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తీశాడు. అదే.. ధ‌మ్కీ.

ఫ‌ల‌క్‌నుమా దాస్ లాగా ఇది రీమేక్ కూడా కాదు. విశ్వ‌క్సేన్ సొంత క‌థ‌తో తెర‌కెక్కింది. ఈ చిత్రానికి నిర్మాత కూడా విశ్వ‌క్ తండ్రే కావ‌డం విశేషం. ఫిబ్ర‌వ‌రి 17నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల‌నుకున్నారు కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల కుద‌ర‌లేదు. ఇప్పుడు సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఖ‌రారైంది. మార్చి 22న ధ‌మ్కీ ప్రేక్ష‌కుల ముందుక రానుంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయ‌బోతుండ‌టం విశేషం.

ధ‌మ్కీ ఫిబ్ర‌వ‌రి నుంచి వాయిదా ప‌డ‌డాని ఇక స్క్రిప్టులో మార్పులు, రీషూట్లు ప్ర‌ధాన కార‌ణం. డిసెంబ‌ర్లో రిలీజైన ధ‌మాకా క‌థ‌తో దీనికి పోలిక‌లు ఉండ‌డంతో స్క్రిప్టును మార్చి కొన్ని సీన్లు తీసి కొత్త సీన్లు జోడించాడు విశ్వ‌క్. దీంతో ఇప్పుడు సినిమా క‌ల‌ర్ మారిన‌ట్లు తెలుస్తోంది. అందుకే ముందు చూసిందానితో పోలిస్తే భిన్నంగా ఒక కొత్త ట్రైల‌ర్ కూడా క‌ట్ చేస్తున్నాడ‌ట విశ్వ‌క్.

ఈ నెల 17న ధ‌మ్కీ ప్రి రిలీజ్ ఈవెంట్ అనుకుంటున్నారు. ఈ వేడుక‌కు విశ్వ‌క్ ఫేవ‌రెట్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌స్తాడ‌ని స‌మాచారం. ఆయ‌న చేతుల మీదుగానే ధ‌మ్కీ కొత్త ట్రైల‌ర్ రిలీజ్ కానుంది. విశ్వ‌క్ ద్విపాత్రాభిన‌యం చేసిన ఈ చిత్రంలో అత‌డికి జోడీగా నివేథా పెతురాజ్ న‌టించింది.