ఇళయరాజా కోసం అపూర్వ కలయిక

వయసు జనరేషన్ తో సంబంధం లేకుండా సినిమా పాటల సంగీతాన్ని దశాబ్దాల తరబడి ప్రేమించేలా చేసిన అరుదైన లెజెండ్స్ లో ఇళయరాజా ఒకరు. టాలీవుడ్ ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ పేర్లు చెప్పమంటే మొదటి టాప్ టెన్ లో సగం ఈయనవే ఉంటాయి. పాతికేళ్ళు నిండని ఇప్పటి కుర్రకారు సైతం గీతాంజలి, అభినందన లాంటి ఆల్బమ్స్ ని ఎంతగా ఇష్టపడతారో చెప్పుకుంటూ పోతే పుస్తకమే అవుతుంది. వెయ్యి సినిమాలకు పైగా సుదీర్ఘ అనుభవమున్న రాజా గారికి అభిమాని కాని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్ఫూర్తిగా తీసుకోవాల్సిన గొప్ప జీవితమది.

అలాంటి లెజెండ్ మ్యూజిక్ ని ప్రత్యక్షంగా ఆస్వాదించే అవకాశం వస్తే దానికన్నా కావలసింది ఏముంటుంది. రేపు ఆదివారం హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మాస్ట్రో లైవ్ కాన్సర్ట్ జరగబోతోంది. ప్రత్యేక అతిథులుగా పలువురు ఇండస్ట్రీ సెలెబ్రిటీలు రాజకీయ నాయకులు హాజరు కాబోతున్నారు. చిరంజీవి, నాగార్జున తదితర ప్రముఖులు రాజాగారితో పాటు స్టేజిని పంచుకోబోతున్నారు. తమ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ జ్ఞాపకాలను స్టేజి మీద పంచుకోబోతున్నారు. ఒక రోజు ముందు సాయంత్రం అనూప్ రూబెన్స్, విశాల్ చంద్రశేఖర్ లతో స్పెషల్ ట్రిబ్యూట్ ప్రోగ్రాం ఉంటుంది.

అయిదేళ్ల క్రితం ఇదే తరహాలో భాగ్యనగరంలో లైవ్ కార్యక్రమం జరిగింది కానీ అప్పటి నిర్వహణ లోపాల వల్ల ఆశించిన స్థాయిలో రీచ్ రాలేదు. కానీ ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలుగు తమిళ మలయాళం నుంచి ప్రముఖ గాయనీ గాయకులూ ఇందులో పాలు పంచుకోబోతున్నారు. గాన గంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం గారు లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించేదే అయినా దాన్ని భర్తీ చేసేందుకు మనో, చిత్రలాంటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. సర్ప్రైజ్ గెస్టులు కూడా చాలా మంది హాజరయ్యే అవకాశముంది.