ఆ జాబితాలో పరశురామ్ కూడా..


తమిళ దర్శకుల కోసం తెలుగు హీరోలు, నిర్మాతలు వెంటపడడం.. ఇక్కడొచ్చి వాళ్లు సినిమాలు చేయడం దశాబ్దాల నుంచి ఉన్నదే. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారిపోయింది. మన సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో అదరగొట్టేస్తుండడం.. భారీ వసూళ్లు రాబడుతుండడం.. అదే సమయంలో తమిళ దర్శకుడు డౌన్ అయిపోవడంతో అక్కడి హీరోల ఆలోచన మారుతోంది. తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పటికే విజయ్.. మన వంశీ పైడిపల్లితో ‘వారసుడు’ సినిమా చేశాడు. ఆ చిత్రం డివైడ్ టాక్ తట్టుకుని కమర్షియల్‌గా పెద్ద సక్సెసే అయింది. ఇప్పుడిక ధనుష్.. మరో టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో చేసిన ‘సార్’ విడుదలకు సిద్ధమైంది. అది కూడా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. ధనుష్.. శేఖర్ కమ్ములతోనూ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

వీళ్ల తర్వాత మరో టాలీవుడ్ దర్శకుడు కోలీవుడ్ హీరోతో జట్టు కట్టబోతున్నాడు. అతనే.. పరశురామ్. ‘సర్కారు వారి పాట’ తర్వాత కొత్త సినిమా ప్రకటన విషయంలో బాగానే టైం తీసుకున్నాడు పరశురామ్. నాగచైతన్యతో అనుకున్న సినిమా వర్కవుట్ కాలేదు. ఇటీవలే తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ‘గీత గోవిందం’లో హీరోగా చేసిన విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేశాడు. ఆ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నాడు.

ఇప్పుడు పరశురామ్ తమిళ కథానాయకుడు కార్తితో సినిమాను ఓకే చేయించుకున్నట్లు సమాచారం. కార్తిని పరశురామ్ కలుస్తున్నట్లు ఇంతకుముందే వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు వీరి సినిమా ఓకే అయినట్లు తెలుస్తోంది. కానీ కార్తికి చాలా కమిట్మెంట్లు ఉండడంతో ఈ సినిమా పట్టాలెక్కడానికి టైం పడుతుంది. ఈలోపు విజయ్ దేవరకొండతో సినిమాను పూర్తి చేస్తాడు పరశురామ్. అతడికి చాలా మంది నిర్మాతలతో కమిట్మెంట్లు ఉండగా.. వారిలో ఒకరికి ఈ ప్రాజెక్టును ఇప్పించనున్నట్లు తెలుస్తోంది.