ముంచినా తేల్చినా.. ఈ సినిమానే

సినీ రంగంలో ఫేమ్, తెచ్చుకోవడం ఎంత కష్టమో.. వాటిని నిలబెట్టుకోవడం అంత కష్టం. కిరణ్ అబ్బవరం అనే బ్యాగ్రౌండ్ లేని హీరోకు టాలీవుడ్లో అనుకోకుండా మంచి గుర్తింపే వచ్చింది. అతడి తొలి చిత్రం ‘రాజావారు రాణివారు’ థియేటర్లలో అంతగా ఆడకపోయినా.. లాక్ డౌన్ టైంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను బాగానే అలరించింది. కిరణ్‌కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఆ తర్వాత అతను చేసిన ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా హిట్టయిందంటే అందుక్కారణం జనాల్లో కిరణ్‌ మీద ఏర్పడ్డ సానుకూల అభిప్రాయమే. కుర్రాడు కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు..

టాలెంట్ ఉంది అని అతణ్ని ప్రోత్సహించారు. కానీ ప్రేక్షకుల నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. సెబాస్టియన్, నేను మీకు బాగా కావాల్సినవాడిని లాంటి నాసిరకం సినిమాలు అందించాడు. మధ్యలో వచ్చిన ‘సమ్మతమే’ వీటితో పోలిస్తే కొంచెం బెటర్ కానీ.. అది కూడా ప్రేక్షకులకు పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయింది.

కిరణ్ పట్ల ప్రేక్షకులు ఎలా ఆసక్తి కోల్పోతున్నారు అనడానికి ‘నేనను మీకు బాగా కావాల్సినవాడిని’ రుజువుగా నిలిచింది. ఆ సినిమాకు మినిమం ఓపెనింగ్స్ లేవు. రిలీజయ్యాక జనాలు అస్సలు పట్టించుకోలేదు. దీంతో వచ్చిన పేరంతా కిరణ్ పోగొట్టుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తుంటే అతణ్ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇలాంటి టైంలో కిరణ్ తన కెరీర్‌కే అత్యంత కీలకమైన ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇది గీతా ఆర్ట్స్ వాళ్ల సినిమా కావడంతో ఆషామాషీగా అయితే ఉండదన్న ఒక నమ్మకం ఉంది.

మురళి కిషోర్ అబ్బూరు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో కొంచెం అంచనాలు పెంచాయి. కానీ గీతా వాళ్ల ట్రాక్ రికార్డు కూడా ఈ మధ్య ఏమంత బాగా లేదు. ఆ సంస్థ నుంచి స్థాయికి తగ్గ సినిమాలు రాలేదు.

గత ఏడాది ఈ సంస్థ నుంచి వచ్చిన ‘పక్కా కమర్షియల్’ డిజాస్టర్ కాగా.. ఊర్వశివో రాక్షసివో, 18 పేజెస్ యావరేజ్‌గా ఆడాయి. మరి కిరణ్ కెరీర్‌కు అత్యంత కీలకంగా భావిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.