పాత సినిమాను ఎగబడి చూస్తున్నారు

టాలీవుడ్ లో మొదలై విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకుని ఆ తర్వాత ఓవర్ డోస్ తో హైప్ తగ్గించేసుకున్న రీ రిలీజుల ట్రెండ్ ముందు తమిళనాడుకు పాకి ఇప్పుడు కేరళకు చేరింది. పాత బ్లాక్ బస్టర్లను రీ మాస్టర్ ని చేసి ఇప్పటి తరం ప్రేక్షకులకు అందివ్వాలన్న ఆలోచన అక్కడి నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నారు. నిన్న మోహన్ లాల్ స్పడిగం 4కె ప్రింట్ కి మార్చి, ఒరిజినల్ వెర్షన్ లో లేని 9 నిమిషాల ఫుటేజ్ ని అదనంగా కలపి, డీటీఎస్ మిక్స్ కోసం చిత్ర లాంటి ప్రముఖ సింగర్లతో మళ్ళీ పాటలు పాడించి భారీ ఖర్చుతో అధిక థియేటర్లలో విడుదల చేశారు.

మొదటి రోజు దీనికి కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. థియేటర్లలో ఫ్యాన్స్ అల్లరి చేస్తూ ఊగిపోతూ ఈ బ్లాక్ బస్టర్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే రిలీజైన మోహన్ లాల్ కొత్త సినిమా అలోన్ కన్నా దీనికి ఎక్కువ వసూళ్లు రావడం షాకింగ్ ట్విస్టు. స్పడిగం 1994లో వచ్చింది. ఏడాది ఆడిన సెంటర్లున్నాయి. అలా అని ఇది మనకు పరిచయం లేని కథేమీ కాదు. అప్పట్లో దీన్ని చూసి ఇష్టపడి మరీ నాగార్జున వజ్రంగా 1996లో రీమేక్ చేయించుకున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వం వహించగా రోజా హీరోయిన్. అయితే ఇది అనూహ్యంగా డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ ఊహించలేదు.

ఈ పరిణామం మోహన్ లాల్ కూడా ఊహించనిది. ముప్పై ఏళ్ళ క్రితం వచ్చిన చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు కానీ తన లేటెస్ట్ మూవీకి మాత్రం పరాభవం కట్టబెట్టడం చూసి కంటెంట్ పట్ల జనం ఎంత సీరియస్ గా ఉన్నారో అర్థం చేసుకున్నారు. స్పడిగంని నిజంగానే అద్భుతమైన క్వాలిటీతో విడుదల చేశారు. మనదగ్గరేమో గ్యాంగ్ లీడర్ కేవలం సరైన ప్రింట్ దొరకని కారణంగా అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు అమ్మేసిన తర్వాత క్యాన్సిల్ చేసి అభిమానులను నిరాశపరిచారు. అయినా ఇవి సీజనల్ గా అప్పుడప్పుడు వస్తే బాగుంటాయి కానీ అదే పనిగా నెలకు రెండు మూడు వదిలితే అంతే సంగతులు.