తమ్ముడి పేరెత్తినా.. తమ్ముడిని చూపించినా..

పునీత్ రాజ్ కుమార్ ఎంత గొప్పవాడో అతను చనిపోయాకే ప్రపంచానికి తెలిసిందే. బతికున్నంత వరకు అతను కన్నడనాట ఒక పెద్ద హీరో. అంత వరకే. కానీ ఏడాదిన్నర కిందట పునీత్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించాక.. అతనెంత గొప్ప వ్యక్తో, ప్రచారానికి దూరంగా ఎంత పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడో వెల్లడైంది. అప్పుడు భాష, ప్రాంతం అనే భేదం లేకుండా అతడి గురించి అందరూ బాధ పడ్డారు.

తండ్రి రాజ్ కుమార్ పేరు నిలబెడుతూ గొప్ప నడవడికతో మెలిగిన పునీత్‌కు తన సోదరులతో ఎంత గొప్ప అనుబంధం ఉందనేది కూడా అతను చనిపోయాకే తెలిసిందే. పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ బయట ఏ కార్యక్రమంలో పాల్గొన్నా సరే.. తమ్ముడు పేరు ఎత్తినా, అతడి బొమ్మ కనిపించినా తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటి పర్యంతం అవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం.

ఐతే పునీత్ మరణించి ఏడాదిన్నర కావస్తున్నా.. శివరాజ్ ఇంకా తమ్ముడి లేని లోటు నుంచి బయట పడ్డట్లుగా లేడు. తాజాగా తన కొత్త చిత్రం ‘వేద’ ప్రి రిలీజ్ ఈవెంట్ కోసమని శివరాజ్ హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ వేడుకకు శివరాజ్ సన్నిహితుడైన నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా వచ్చాడు. ఈ సందర్భంగా మధ్యలో పునీత్ గురించి ప్రస్తావిస్తూ ఒక ఏవీ ప్లే చేశారు ఈవెంట్ ఆర్గనైజర్స్. అంతే.. శివరాజ్ తట్టుకోలేకపోయాడు. ఎప్పట్లాగే బోరున విలపించాడు. పక్కనే ఉన్న బాలయ్య శివన్నను పట్టుకుని ఓదార్చే ప్రయత్నం చేశారు.

అనంతరం వేదిక ఎక్కాక బాలయ్య.. పునీత్ గురించి చాలా బాగా మాట్లాడాడు. మనందరం మేం అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెబుతుంటామని.. కానీ పునీత్ ఎలాంటి ఆర్భాటం లేకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడని.. పునీత్ మన మధ్య లేకపోయినా ఆయన స్థానం ఆయనదే, ఆయన స్థాయి ఆయనదే అని బాలయ్య పేర్కొన్నాడు.