మహిళలకు పద్మభూషణ్ బంపర్ ఆఫర్

సినిమా ప్రమోషన్ అంటే కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఇంటర్వ్యూలు కాదు. ఇవి చేసినంత మాత్రాన జనానికి మన సినిమా చేరుతుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే కంటెంట్ ఎంత బాగున్నా ఫ్యామిలీ ఆడియన్స్ అందులోనూ ముఖ్యంగా మహిళలు థియేటర్ల దాకా రావాలంటే టికెట్ ఖర్చుతో మొదలుపెట్టి ఇంత బిజీగా రెండున్నర గంటలు వినోదం కోసం ఖర్చు పెట్టడం అవసరమా అనే ఆలోచన దాకా వెళతారు. అందుకే స్టార్ హీరోలు లేనివాటికి పబ్లిసిటీ చాలా కీలకంగా మారింది. కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా పెట్టుకుని వచ్చిన రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.

కేవలం నాలుగు రోజులకే అయిదు కోట్ల గ్రాస్ దాటేసి భేష్ అనిపించింది. తాజాగా దీని ప్రమోషన్ ని రైటర్ టీమ్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు రేపొక్క రోజు అంటే ఫిబ్రవరి 8న పద్మభూషణ్ ఆడుతున్న థియేటర్లలో ఈ మూవీని ఉచితంగా చూసేయొచ్చు. ఎలాంటి ప్రవేశ రుసుము ఉండదు. కాకపోతే టైంకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటే చాలు. హౌస్ ఫుల్ అయ్యాక తిరిగి వచ్చే అవసరం బాధ రెండూ తప్పుతాయి. నిన్నటి నుంచి టీమ్ ఫస్ట్ టైం ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని ప్రచారం చేసింది దీని గురించే. అయితే ఇది మొదటిసారి కాదు.

గతంలోనూ కొన్ని చిన్న సినిమాలు ఉదయం ఆటలు ఫ్రీగా స్క్రీన్ చేసిన దాఖలాలు ఉన్నాయి కానీ హిట్ అయిన నోటెడ్ రిలీజ్ ని అది కూడా రెండో వారంలోకి అడుగు పెట్టకుండానే ఇలా ఉచిత ప్రదర్శనలు పెట్టడం ఇదే మొదలు. అయినా పదే పదే ఈవెంట్ల మీద అవుట్ డోర్ పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టడం కన్నా ఈ షోలకయ్యే ఖర్చు తక్కువ కాబట్టి ఒకరకంగా చెప్పాలంటే ఇది మంచి ఆలోచన. అసలే లేడీ ఎమోషన్ బాగా పండింది. ముఖ్యంగా తల్లి పాత్ర కంటితడి పెట్టించింది. ఇప్పుడు ఎక్కువ శాతం చూసేస్తారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చే టాక్ ని ఎన్ని కోట్లు పెట్టినా కొనలేమన్నది వాస్తవం.