త్రివిక్రమ్ దోస్తీ .. తమన్ హ్యాపీ

ఇండస్ట్రీలో ఎవరికైనా ఓ సపోర్టింగ్ పిల్లర్ ఉండాలి. మనలో టాలెంట్ ను వెతికి తీసే ప్రతిభ ఉన్న వ్యక్తితో దోస్తీ కుదిరితే ఇక లైఫ్ మరోలా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు తమన్ లైఫ్ ఇలానే ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చాడు. కానీ ‘అల వైకుంఠపురములో’ నుండి సరికొత్త తమన్ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. దానికి మూల కారణం త్రివిక్రమే. అరవింద సమేత నుండి త్రివిక్రమ్ తో తమన్ కి దోస్తీ కుదిరింది. అప్పటి నుండి తమన్ త్రివిక్రమ్ ను దేవుడిలా చూస్తున్నాడు.

తన సినిమాకు అల్టిమేట్ ఆల్బమ్ ఇచ్చిన తమన్ కి ఎప్పటికప్పుడు సపోర్ట్ అందిస్తూనే ఉన్నాడు త్రివిక్రమ్. సపోర్ట్ మాత్రమే కాదు తమన్ కి ఎప్పటికప్పుడు సినిమా అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. అల వైకుంఠ పురములో తర్వాత తమన్ కి భీమ్లా నాయక్ సినిమా ఇచ్చాడు త్రివిక్రమ్. సినిమాకు కర్త కర్మ క్రియ తనే కావడంతో తమన్ కి గోల్డెన్ ఛాన్స్ అందింది. డీజే టిల్లుకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడు తమన్. అది కూడా త్రివిక్రమ్ రిఫరెన్స్ తో చేసిందే. ఇక హారికా హాసినీ బేనర్ లో అన్ని సినిమాలకు తమన్ నే మ్యూజిక్ ఇస్తున్నాడు. రాబోయే మహేష్ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ ఇస్తున్న విషయం తెలిసిందే. సితారలో కూడా తమన్ మ్యూజిక్ ఉండనే ఉంటుంది.

తాజాగా తమన్ మరోసారి పవన్ కళ్యాణ్ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. సుజీత్ డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న సినిమాకు తమన్ ను తీసుకున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక కూడా త్రివిక్రమ్ నే ఉన్నట్టు కనిపిస్తుంది. సుజీత్ మరో మ్యూజిక్ డైరెక్టర్ ను అనుకున్నాడట. కానీ పవన్ కళ్యాణ్ తమన్ కే ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పాడని తెలుస్తుంది. ఇక పవన్ -త్రివిక్రమ్ ఎంత మంచి ఫ్రెండ్స్ అన్నది తెలిసిందే. పైగా భీమ్లా నాయక్ కి తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సినిమా తమన్ కి దక్కడానికి రీజన్ త్రివిక్రమే. సో ఎలా చూసుకున్నా త్రివిక్రమ్ తో తమన్ దోస్తీ చేయడం అతనికి బాగా కలిసొస్తుంది.