ఫ్లాప్ హీరో.. రికార్డుతో రీఎంట్రీ

షారుఖ్ ఖాన్ హిట్టు కోసం ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాడు. ఒక దశలో వరుస ఫ్లాపులతో అతను ఎలా అల్లాడిపోయాడో తెలిసిందే. చివరగా ‘జీరో’ సినిమాతో షారుఖ్ మార్కెట్ దాదాపు జీరో అయిపోయినట్లు కనిపించింది. ఈ దెబ్బతో బెంబేలెత్తిపోయిన షారుఖ్.. రెండేళ్ల పాటు కొత్త సినిమా ఊసే ఎత్తలేదు.

ఎన్నో కథలు విని.. చివరికి యశ్ రాజ్ ఫిలిమ్స్ బేనర్లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ‘పఠాన్’ సినిమా చేయడానికి అంగీకారం తెలిపాడు. ఈ సినిమా మొదలైనపుడు, మేకింగ్ దశలో షారుఖ్ లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు.

ఐతే రిలీజ్ ముంగిట ప్రమోషన్ల హడావుడి తప్పదని ఒక పాట రిలీజ్ చేస్తే దాని మీద పెద్ద వివాదమే నడిచింది. దెబ్బకు షారుఖ్ మళ్లీ సైలెంట్ అయిపోయాడు. సిల్లీ కారణాలతో ఈ సినిమాను ఒక వర్గం అదే పనిగా టార్గెట్ చేయడం జనాల్లో సానుభూతిని పెంచింది. మరోవైపు షారుఖ్ అభిమానులతో పాటు యాక్షన్ ప్రియులను ట్రైలర్ బాగా ఆకట్టుకుంది.

మొత్తంగా రిలీజ్ ముంగిట ఈ సినిమాకు ఎక్కడ లేని హైప్ వచ్చేసింది. అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవడం ఆలస్యం.. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. నాలుగు రోజుల వ్యవధిలో పీవీఆర్, ఐనాక్స్, సినీ పోలిస్ మల్లీప్లెక్స్ ఛైన్స్ దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల టికెట్లు అమ్మేయడం విశేషం.

ఇప్పటిదాకా ఏ హిందీ చిత్రానికీ ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని టికెట్లు తెగలేదు. నిజానికి ముంబయి లాంటి పెద్ద నగరాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ఊపందుకోలేదు. చివరి రెండు రోజుల్లో ఆ సిటీల్లో ఊపు వేరే లెవెల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ.15 కోట్ల దాకా వసూళ్లను రాబట్టేసిందట ‘పఠాన్’.

ఇక రిలీజ్ ముందు రోజు వరకు జరిగే ప్రి సేల్స్, తొలి రోజు వాకిన్స్ కూడా కలుపుకుంటే ఈజీగా రూ.50 కోట్ల మార్కును ‘పఠాన్’ టచ్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పటిదాకా ఏ హిందీ చిత్రం కూడా తొలి రోజు అంత వసూళ్లను రాబట్టలేదు. వరుసగా డిజాస్టర్లు చూసిన షారుఖ్.. ఇలాంటి రికార్డుతో రీఎంట్రీ ఇవ్వబోతుండడం విశేషమే.