ఇస్మార్ట్ హీరోయిన్ యాక్సిడెంట్ షాక్

మూడేళ్ళ క్రితం వచ్చిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ సూపర్ బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా నటించిన నభ నటేష్ కు మంచి పేరే వచ్చింది. పూరి జగన్నాధ్ స్టైల్ లో రూపొందిన మాస్ టచ్ ఉన్న బ్యూటీగా యూత్ లో ఫాలోయింగ్ పెంచింది. అందులో నటించిన నిధి అగర్వాల్ ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లులో ఛాన్స్ కొట్టేస్తే ఈ నభా మాత్రం కనిపించకుండా పోయింది. మధ్యలో చేసిన రవితేజ డిస్కో రాజా డిజాస్టర్ కాగా సాయి ధరమ్ తేజ్ తో నటించిన సోలో బ్రతుకే సో బెటరూ డీసెంట్ రన్ అనిపించుకుంది. ఆ టైంలో అవకాశాలు బాగానే వచ్చాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ మరీ అన్యాయంగా ఫ్లాప్ కాగా నితిన్ తో జట్టు కట్టిన మాస్ట్రో ఓటిటి రిలీజ్ కావడంతో పెద్దగా ప్రయోజనం కలగలేదు. అటుపై ఈ కన్నడ భామ ఉనికి లేదు. తాజాగా ట్విట్టర్ లో ఇచ్చిన షాక్ తో తనకేమైందో వివరించింది. దాని ప్రకారం 2022లో నభ నటేష్ కు పెద్ద యాక్సిడెంటే జరిగింది. ఎడమ భుజం దగ్గర ఎముకలు విరగడంతో పాటు పదే పదే కొన్ని క్లిష్టమైన సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో మానసికంగా శారీరకంగా చాలా శ్రమపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆ ప్రమాదం నుంచి కోలుకుని తిరిగి సినిమాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.

ఈ మధ్య కాలంలో హీరోయిన్లు తరచూ ఇలాంటి పరిస్థితులకు లోను కావాల్సి వస్తోంది. సమంతా వ్యాధితో పోరాడి నెలల తర్వాత నిన్న మీడియా ఫ్యాన్స్ ని ఎంతగా కదిలించిందో చూశాం. హంసా నందిని క్యాన్సర్ బారిన పడి క్రమంగా కోలుకుంటోంది. ఇప్పుడు నభ నటేష్ ఇలా ఆసుపత్రిలో ఎక్కువ కాలం గడపాల్సి రావడం బాధాకరం. క్షేమంగా బయటికి రావడం కన్నా కావాల్సింది ఏముంటుంది కానీ తెరమీద చూపించాల్సిన స్థైర్యం నిజ జీవితంలోనే ప్రదర్శించాల్సి రావడం అరుదుగా జరుగుతుంది. ఆ మధ్య సుప్రీమ్ హీరో సైతం మృత్యుముఖం దాక వెళ్లి దాన్ని ఓడించి మరీ త్వరలో విరూపాక్షగా రాబోతున్న సంగతి తెలిసిందే.