అవతార్ 2 కట్టిపడేస్తోంది కానీ

వామ్మో ఇవేం కలెక్షన్స్ రా బాబు అనుకునేలా ఇవాళ అవతార్ 2 ది వే అఫ్ వాటర్ గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. దేశంలో అన్నిటికంటే ఏపీ తెలంగాణలోనే భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ టాక్. పెద్ద స్క్రీన్లున్న థియేటర్లు మల్టీప్లెక్సుల్లో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది.

టూడి వెర్షన్ కన్నా త్రీడిలోనే చూసేందుకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇవ్వడంతో ఆన్ లైన్ లోనే బుకింగ్స్ క్లోజ్ అవుతున్నాయి. ఈ దూకుడు ఎన్ని రోజులు ఉంటుందనే దాన్ని బట్టి ఫిగర్లు, రికార్డులు బద్దలు కొడతాయా లేదా అనేది తేలుతుంది. ప్రాధమికంగా అందిన సమాచారం మేరకు ఇండియా వైడ్ అవెంజర్స్ ఎండ్ గేమ్ ని దాటలేదని రిపోర్ట్

ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు మంచి అనుభూతితో బయటికి వస్తున్నారు. కాకపోతే నిడివి విషయంలో దర్శకుడు జేమ్స్ క్యామరూన్ రాజీ పడకపోవడంతో అదొక్కటే మైనస్ గా నిలుస్తోంది. కనీసం ఇరవై నిముషాలు ట్రిమ్ చేస్తే ఆడియన్స్ కి ఫీల్ పెరగడంతో పాటు తమకు టైమింగ్ పరంగా ఎక్స్ ట్రా షోలు వేసుకునే వెసులుబాటు వస్తుందని ఎగ్జిబిటర్లు అంటున్నారు.

కానీ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న డిస్నీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి ఆ సంకేతాలేమీ కనిపించడం లేదు. ఒకవేళ రివ్యూలను సీరియస్ గా తీసుకుని లెన్త్ కు కోత వేస్తే రాబోయే రోజుల్లో ఆక్యుపెన్సీకి ఉపయోగపడుతుంది.

ఇదంతా బాగానే ఉంది కానీ విజువల్ ఎఫెక్ట్స్ ఎంత సూపర్బ్ గా ఉన్నా మొదటి భాగం ఉన్నంత రేంజ్ లో సెకండ్ పార్ట్ లేదనే వాళ్ళు లేకపోలేదు. పదమూడేళ్ల కాలంలో పబ్లిక్ పల్స్ లో చాలా మార్పులొచ్చాయి. దానికి అనుగుణంగా కొంచెం ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లేని సెట్ చేసుంటే రిపీట్స్ వేసేవాళ్ళమని అభిమానులు చెబుతున్నారు.

పండోరా ప్రపంచాన్ని సముద్రం లోతుల్లోకి తీసుకెళ్లిన జేమ్స్ క్యామరూన్ మూడో భాగానికి సరిపడా ఫలితాన్ని తెచ్చుకున్నారు. ఇది ఫ్లాప్ అయితే థర్డ్ పార్ట్ తో ఆపేస్తానని ఆ మధ్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెస్పాన్స్ చూస్తుంటే పార్ట్ ఫైవ్ దాకా కన్ఫర్మ్ అని హాలీవుడ్ టాక్